Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా. పర్ఫెక్ట్‌గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలశ్యం ఇలా ఫాలో అవ్వండంతే..!

Karivepaku Kaaram Podi

Karivepaku Kaaram Podi

Karivepaku Kaaram Podi: కరివేపాకు అనగానే చాలామంది కూరల్లోంచి తీసి పక్కన పెట్టేస్తుంటారు. కానీ అందులో విటమిన్ A, B, C, E, K వంటి ఎన్నో పోషకాలు, ఐరన్ మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి, కంటి చూపు మెరుగుపడటానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ పోషకాలన్నీ శరీరానికి అందాలంటే అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీల్లోకి చక్కగా సరిపోయే కమ్మనైన, సంప్రదాయ కరివేపాకు కారప్పొడి ఉత్తమ ఎంపిక. సరైన కొలతలతో, నెలల తరబడి నిల్వ ఉండేలా ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:

* కరివేపాకు: 300 గ్రాములు (బాగా కడిగి, తడి ఆరబెట్టినది)
* శనగపప్పు: 4 టేబుల్ స్పూన్లు
* మినప్పప్పు: 4 టేబుల్ స్పూన్లు
* పల్లీలు (వేరుశనగ గుళ్ళు): 2 టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా కొద్దిగా)
* ధనియాలు: 1 చిన్న టీ గ్లాసు (సుమారు 6 – 7 స్పూన్లు)
* జీలకర్ర: 1.5 స్పూను
* ఎండుమిర్చి: 50 వరకు (సుమారు 60–70 గ్రాములు, మీ కారానికి తగినట్లు)
* వెల్లుల్లి రెబ్బలు: 10–12
* ఎండు కొబ్బరి: చిన్న ముక్క
* చింతపండు: చిన్న నిమ్మకాయ సైజులో సగం (కొద్దిగా)
* నూనె: 2–3 గరిటెలు (వేయించడానికి సరిపడా)
* ఉప్పు: రుచికి తగినంత (రాళ్ళ ఉప్పు పొడి అయితే మరింత రుచి)

తయారీ విధానం..

ఆకును శుభ్రపరచడం & ఆరబెట్టడం

కరివేపాకు కారప్పొడి తయారీకి ముందుగా ఆకును కొమ్మలతో ఉన్నప్పుడే శుభ్రంగా కడిగి, నీరు లేకుండా దులిపి ఆరబెట్టుకోవాలి. ఆకుల వెనుక తెల్లటి పురుగు గుడ్లు లేదా మచ్చలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని పాడైన వాటిని తీసేయాలి. పొడి నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉండాలంటే ఆకుపై ఏమాత్రం తడి లేకుండా ఫ్యాన్ గాలికి పూర్తిగా డ్రై అయ్యేలా ఆరబెట్టడం ముఖ్యం.

పప్పులు & దినుసులు వేయించడం

ఆ తర్వాత బాండీలో రెండు చెంచాల నూనె వేసి వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి. ఇందులోనే పప్పుల రుచి డామినేట్ చేయకుండా కొద్దిగా పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాండీలో ఎండుమిరపకాయలు కూడా వేసి, అవి క్రిస్పీగా మారి రంగు మారేంత వరకు వేయించి పక్కన ఉంచాలి.

కరివేపాకు, వెల్లుల్లి వేయించడం

అనంతరం బాండీలో మరో గరిటెడు నూనె వేసి కరివేపాకును చేర్చి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఆకు కరకరలాడే వరకు వేయించాలి. సరిగ్గా వేగకపోతే పొడి ముద్దగా మారుతుంది. ఆకు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి, ఆ వేడి బాండీలోనే వెల్లుల్లి రెబ్బలు వేయాలి. బాండీ వేడికే వెల్లుల్లిలోని పచ్చిదనం పోతుంది. అయితే అడుగున ఆకు మాడకుండా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ చల్లారనివ్వాలి.

గ్రైండింగ్ విధానం

దినుసులు చల్లారాక మిక్సీ జార్‌లో ముందుగా వేయించిన పప్పులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్క, రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త రవ్వలాగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఇందులోనే వేయించిన ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు వేసి తిప్పాలి (చింతపండు ఎక్కువైతే పులుపు ఎక్కువవుతుంది కాబట్టి తక్కువగానే వేసుకోవాలి). చివరగా వేయించిన కరివేపాకు, వెల్లుల్లి వేసి మరీ మెత్తటి పౌడర్‌లా కాకుండా కాస్త బరకగా ఉండేలా పల్స్ మోడ్‌లో తిప్పుకోవాలి. పొడినంతటినీ ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని చేత్తో బాగా కలిపి, పూర్తిగా చల్లారాక గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకోవాలి.

ఈ పొడిని వేడివేడి అన్నంలో చెంచాడు వేసుకుని, కొద్దిగా స్వచ్ఛమైన వేరుశనగ నూనె లేదా నెయ్యితో కలుపుకుని తింటే అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇడ్లీ, కరకరలాడే నెయ్యి దోశ లేదా ఉప్మాపై చల్లుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఆకును తడి లేకుండా చూసుకుని నూనెలో సరిగ్గా వేయిస్తే ఈ పొడి కనీసం 1 నుండి 2 నెలల పాటు తాజాగా నిల్వ ఉంటుంది.