Ragi Burelu: ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందులో భాగంగా చిరుధాన్యాలతో (మిల్లెట్స్) చేసే వంటకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రాగి పిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో రుచికరమైన, మృదువైన ‘రాగి పిండి బూరెలు’ ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా. ఈ బూరెలు కేవలం రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వాటిని సాంప్రదాయ పద్ధతిలో ఎలా సింపుల్గా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
రాగి పిండి – 1 కప్పు
గోధుమ పిండి – 1 కప్పు
ఎండు కొబ్బరి – 2 ఇంచుల ముక్క
యాలకులు – 3, 4
బెల్లం తురుము – 1 కప్పు
నువ్వులు – 2, 3 టీస్పూన్లు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
వంట సోడా – పావు టీస్పూన్
కాచి చల్లార్చిన పాలు – తగినన్ని
ఉప్పు – చిటికెడు
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం..
ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులను మిక్సీ గిన్నెలో వేసి బరకగా కాకుండా మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రాగి పిండి, గోధుమ పిండిలను జల్లించి తీసుకోవాలి. ఈ పిండిలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. రాగి పిండిలో గోధుమ పిండి కలపడం వల్ల బూరెలు గట్టిగా కాకుండా మృదువుగా వస్తాయి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో నువ్వులు, ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పొడి వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. ఆపై ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి దించేయాలి.
ఇప్పుడు ఈ వేడి వేడి బెల్లం నీళ్లను రాగి పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. ఇందులోనే పావు టీస్పూన్ వంట సోడా వేయాలి. అనంతరం కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా పోస్తూ పిండిని సాఫ్ట్ గా, కాస్త జిగురుగా ఉండేలా కలుపుకోవాలి. నీళ్లకు బదులు పాలు వాడటం వల్ల బూరెలు ఎంతో రుచిగా వస్తాయి. ఈ పిండిని ఐదు నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచాలి.స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత.. చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని పిండిని చిన్న ముద్దలుగా తీసుకోవాలి. అరిటాకు లేదా ప్లాస్టిక్ కవర్ పై నూనె రాసి, పిండిని మీడియం మందంతో చిన్న అప్పాల్లా వత్తుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి, మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా బాగా తిప్పుతూ వేయించుకోవాలి. పిండి కరెక్ట్గా కలపడం వల్ల బూరెలు నూనెలో వేయగానే చక్కగా పొంగుతాయి. అంతే ఎంతో రుచికరమైన, మృదువైన ఆరోగ్యకరమైన రాగి బూరెలు రెడీ. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ స్వీట్ను కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
రాగి పిండి, బెల్లం, నువ్వులు వంటి పోషకాలు నిండిన పదార్థాలతో తయారు చేసే ఈ ‘రాగి బూరెలు’ కేవలం రుచికరమైన స్వీట్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఒక వరం లాంటిదని చెబుతున్నారు. ఇందులో ఉపయోగించే చిరుధాన్యాలైన రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే నువ్వుల్లో కూడా కాల్షియం ఉంటుంది. ఇవి ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి ఎంతగానో సహాయపడతాయి. పెరుగుతున్న పిల్లలకు, కీళ్ల నొప్పులతో బాధపడే వృద్ధులకు ఇది చాలా మంచి ఆహారం. ఈ బూరెల్లో వాడిన రాగి పిండి, బెల్లం.. రెండింటిలోనూ ఐరన్ (ఇనుము) శాతం మెండుగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని వేగంగా పెంచి రక్తహీనత దరిచేరకుండా కాపాడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
రాగుల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు బెల్లం, యాలకులు కూడా చేర్చడం వల్ల ఇవి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. మలబద్ధకం సమస్యను నివారించి, పొట్టను తేలికగా ఉంచుతాయి. బెల్లం, గోధుమ పిండి, నెయ్యి శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందించి తక్షణ శక్తిని ఇస్తాయి. అలసటగా లేదా నీరసంగా ఉన్నప్పుడు ఇది శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తుంది. మనం పంచదారకు బదులుగా వాడిన బెల్లం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. అలాగే నువ్వులలో ఉండే జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నువ్వులు, ఎండు కొబ్బరిలో గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి.

