Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..

Pesticides Linked

Pesticides Linked

Nature Health Study: ప్రస్తుతం వ్యవసాయ రంగం పూర్తిగా మారిపోయింది. తాతల కాలంలో ఎలాంటి మందులు వాడకుండా సాంప్రదాయ పద్దతిలో పంటలు పండించే వాళ్లు. కానీ.. ప్రస్తుతం క్రిమి సంహారక మందుల (Pesticides) వాడకం పెరిగిపోయింది. ఈ పురుగు మందుల వాడకం ఆందోళన కలిగిస్తోంది. ఈ మందుల వల్ల దీర్ఘకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ‘నేచర్ హెల్త్’ (Nature Health) జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఎక్కువగా ఉందని ఈ పరిశోధన హెచ్చరించింది. అంటే వ్యవసాయ క్షేత్రంలో నివసించే వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువట. టౌలౌస్ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నియోప్లాస్టిక్ డిసీజెస్ వంటి సంస్థలు కలిసి నిర్వహించిన ఈ అధ్యయనం, రసాయన భద్రతా ప్రమాణాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపింది.

సాధారణంగా గతంలో జరిగిన పరిశోధనలు ఏదో ఒక రసాయనం వల్ల కలిగే ప్రభావాన్ని మాత్రమే విశ్లేషించేవి. కానీ ఈ అధ్యయనం, నిజ జీవితంలో మనుషులు ఒకే సమయంలో అనేక రకాల రసాయనాల మిశ్రమానికి గురవుతారనే కోణంలో సాగింది. పెరూ దేశంలోని వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులు, సామాజిక-ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుని ఈ పరిశోధన చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు ఒకేసారి సగటున 12 రకాల పురుగుమందుల ప్రభావానికి లోనవుతున్నారని, తద్వారా వారు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తలు 2014-2019 మధ్య కాలంలో సాధారణంగా వాడే 31 రకాల పురుగుమందుల వ్యాప్తిని పరిశీలించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వీటిని క్యాన్సర్ కారకాలుగా ఇప్పటి వరకు గుర్తించలేదు. అయినప్పటికీ, 2007-2020 మధ్య కాలంలో సుమారు 1.5 లక్షల మంది క్యాన్సర్ రోగుల వివరాలను విశ్లేషించగా, పురుగుమందుల వాడకం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే క్యాన్సర్ కేసులు గణనీయంగా నమోదైనట్లు తేలింది.

పురుగుమందులు శరీరంలోని కణజాల ప్రక్రియలను దెబ్బతీస్తాయని, దీనివల్ల క్యాన్సర్ వ్యాధి సోకక ముందే శరీరంలో మార్పులు మొదలవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా విషతుల్యాలను శుద్ధి చేసే కాలేయం (Liver) దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతుంది. దీనివల్ల శరీరం ఇతర ఇన్ఫెక్షన్లు, ఒత్తిడికి త్వరగా లోనవుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ‘ఎల్ నినో’ వంటి పరిణామాలు సైతం ఈ రసాయనాలు పర్యావరణంలో వేగంగా వ్యాపించడానికి కారణమవుతున్నాయి. ఇక ఈ అధ్యయనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. కేవలం ఒక్క రసాయనం వల్ల కాకుండా, పలు రసాయనాల మిశ్రమం వల్ల కలిగే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతమున్న భద్రతా నిబంధనలు పాతబడిపోయాయట. రసాయనాల మిశ్రమ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త నిబంధనలు రూపొందించాలని అధ్యయనం సూచించింది. ఈ అధ్యయనం పెరూ దేశంలో జరిపినప్పటికీ.. ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఇది వర్తిస్తుంది. ఈ అధ్యయనం పర్యావరణ ఆరోగ్యంపై మన అవగాహనను మార్చడంతో పాటు, పురుగుమందుల వాడకంపై మరింత కఠినమైన పర్యవేక్షణ, మెరుగైన ప్రజా ఆరోగ్య విధానాలు అవసరమని స్పష్టం చేస్తోంది.