XI Jinping: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆరోగ్యంపై కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు నెలాఖరులో ఆయన కిర్గిజ్స్థాన్కు వెళ్లిన సమయంలో, విమానం నుంచి దిగుతూ భార్య పెంగ్ లియువాన్ చేతిని పట్టుకుని నెమ్మదిగా మెట్లు దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు ఆయన ముఖం ఉబ్బినట్లు కనిపించిందని, నడకలోనూ ఇబ్బంది ఉన్నట్లు భావించారు. ఆయన ఆరోగ్యంపై టిబెట్, తైవాన్, ప్రవాస చైనీస్ వర్గాల్లో చర్చ మొదలైంది.
జిన్పింగ్కు గుండెపోటు..?
దీని తర్వాత చైనా అధ్యక్షుడి ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాన్ని టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధానమంత్రి లోబ్సాంగ్ సాంగే వెల్లడించారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. చైనాలో జిన్పింగ్ తదుపరి వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని సాంగే చెప్పారు. ఈ విషయాన్ని తనకు చైనా ప్రభుత్వానికి చెందిన ఒక అత్యున్నత మాజీ అధికారి చెప్పినట్లు వెల్లడించారు. జిన్పింగ్కు కనీసం రెండు మూడుసార్లు గుండెపోటు వచ్చిందని అన్నారు.
చైనా ప్రభుత్వానికి చెందని ఒక సీనియర్ మాజీ అధికారి తనతో గంట పాటు సమావేశయ్యారని, ఈ సమయంలోనే జిన్పింగ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్పాలరని సాంగే పేర్కొన్నారు. జిన్ పింగ్ కొన్ని సందర్భాల్లో మూడు నుంచి 5 వారాల పాటు ప్రజలకు కనిపించకుండా ఉండటం, ఆ తర్వాత ఆకస్మాత్తుగా బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ఆయన ప్రస్తావించారు. ఆయన అధ్యక్ష పదవి, ప్రభుత్వ బాధ్యతల కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
చైనా జనరల్స్ను ఎందుకు తొలగిస్తున్నారు..?
చైనా అంతర్గత వ్యవహారాలపై మాట్లాడిన సాంగే.. జిన్పింగ్ కీలక చైనీస్ సైనికాధికారుల్ని తొలగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ నియమించిన కొందరు సైనికాధికారులు అదృశ్యమయ్యారని, రక్షణ మంత్రి కూడా గత కొంత కాలంగా కనిపించడం లేదని ఆయన అన్నారు. జిన్పింగ్ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది, సైనిక నాయకత్వం చైనా ప్రభుత్వంలోని మంత్రుల కన్నా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉన్నారని సాంగే అన్నారు.
జిన్పింగ్ వారసుడిపై చర్చ..
చైనాకు తదుపరి అధ్యక్షుడు, జిన్పింగ్ వారసుడిపై స్పష్టమైన ప్రణాళిక ఏదీ కనిపించడం లేదని లోబ్సాంగ్ సాంగే అన్నారు. ఒక వేళ జిన్పింగ్ తన వారసుడిని ప్రకటిస్తే, ఆ వారసుడే అధికారాన్ని త్వరగా చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే ప్రమాదం ఉందని, ఒక వేళ ప్రకటించకపోతే భవిష్యత్తులో అధికార పోరాటానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అధికారాన్ని ఆశించే వర్గాల మధ్య పోటీ తీవ్రం అయితే దేశంలో అంతర్గత ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే జిన్పింగ్ తన వారసుడిని ప్రకటించకపోవచ్చని అన్నారు.
ప్రవాసంలో టిబెట్ ప్రభుత్వం ఎందుకు..?
టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని ప్రస్తుతం సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (CTA)గా పిలుస్తారు. దాని రాజకీయ అధిపతిని సిక్యాంగ్ అంటారు. ప్రస్తుతం పెన్పా త్సెరింగ్ ఈ బాధ్యతలో ఉన్నారు. ఆయన భారతదేశంలోని ధర్మశాలలో నివసిస్తున్నారు. 1950లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) టిబెన్కు ఆక్రమించుకుంది. 1951లో టిబెట్-చైనా మధ్య 17 సూత్రాల ఒప్పందం జరిగింది. దీని ద్వారా టిబెట్ చైనా పరిపాలనలోకి వెళ్లింది. 1959లో లాసా తిరుగుబాటు జరిగింది. చైనా సైన్యం దీనిని అణచివేసింది. ఆ సమయంలో దలైలామా, వేలాది మంది టిబెటన్లు భారత్ వచ్చారు. అప్పటి నుంచి టిబెట్ ప్రవాస పరిపాలన భారత్ నుంచి పనిచేస్తోంది. చైనా మాత్రం టిబెట్ను స్వయంప్రతిపత్తి ప్రాంతంగా పరిగణిస్తుంది. టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని గుర్తించదు.

