కరోనా ఫస్ట్ వేవ్ కలవరపెడితే.. సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలు తీసింది.. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైపోయింది.. భారత్లోనూ వచ్చే నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.. ఇంకా, సెకండ్ వేవ్ ముప్పు పోలేదని ఇప్పటికే భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, తాజా పరిస్థితిలపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని అంటోంది.. పలు దేశాల్లో వ్యాక్సిన్లు.. తీవ్రమైన కేసులు, ఆస్పత్రులకు వెళ్లడాన్ని తగ్గిస్తున్నా.. ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడుతూనే ఉందని తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్.. మృతుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనూ నమోదు అవుతుందన్నారు.. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 5 లక్షల కొత్త కేసులు వెలుగు చూస్తే.. దాదాపు 9,300 మంది మృతిచెందారని పేర్కొన్న ఆమె.. ఆఫ్రికాలో గత రెండు వారాలుగా కొత్త కేసుల్లో 30 నుంచి 40శాతం వృద్ధి కనిపిస్తోందన్నారు.. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను గమనిస్తే.. ‘కరోనా.. తగ్గే మహమ్మారి’లా కనిపించడం లేదనే అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సౌమ్య స్వామినాథన్.