NTV Telugu Site icon

Red Sea: 10 మంది ఇరాన్-మద్దతు హౌతీలను హతమార్చిన అమెరికా..

Red Sea

Red Sea

Red Sea: ప్రపంచ నౌకా వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకలతో పాటు, రెడ్ సీలో ఇతర దేశాలకు చెందిన నౌకలపై కూడా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్నారు.

ఇదిలా ఉంటే ఆదివారం డెన్మార్క్‌కి చెందిన ఓ కంటైనర్ షిప్‌పై హౌతీ రెబల్స్ దాడులు చేశారు. వెంటనే ఈ ప్రాంతంలో గస్తీ కాస్తున్న అమెరికా నేవీ తన హెలికాప్టర్‌లో హైతీలు ఉన్న బోట్లపై దాడులు జరిపి, నాలుగు బోట్లలో మూడు బోట్లను సముద్రంలో ముంచేసినట్లు అమెరికా కమాండ్ కంట్రోల్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ దాడుల్లో 10 మంది హౌతీలను అమెరికా నేవీ హతమార్చినట్లు యెమెన్ లోని హైడైడా పోర్టులోని రెండు సోర్సెస్ తెలిపాయి.

Read Also: Vladimir Putin: “వెనక్కి తగ్గేదే లేదు”.. పుతిన్ న్యూ ఇయర్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు..

అమెరికా దాడి తర్వాత గాయపడిన హౌతీలను రెస్క్యూ చేసినట్లు కొందరు తెలుపగా.. మరో నలుగురు ప్రాణాలతో ఉన్నారని యెమెన్ వర్గాలు తెలిపాయి. అయితే అమెరికా నేవీ దాడిలో 10 మంది హౌతీ తిరుగుబాటుదారులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది.

ఆదివారం రోజు సింగపూర్ ఫ్లాగ్ తో డెన్మార్క్‌కి చెందిన కంటైనర్ షిప్ మార్క్స్ హాంగ్‌జౌ నుంచి తాము దాడికి గురవుతున్నట్లు సందేశం వెళ్లింది. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న అమెరికన్ నేవీ స్పందించి, హౌతీలపై కాల్పులు జరిపింది. కంటైనర్ షిప్‌కి 20 మీటర్ల దూరంలో ఉన్న నాలుగు చిన్న పడవల్లో మూడింటిపై దాడి చేసి ముంచేయగా.. నాలుగో పడవ తప్పించుకున్నట్లు యూఎస్ నేవీ చెప్పింది.