అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి అడుగులు పడుతున్నాయి. ముసాయిదా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సంతకాల కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనవచ్చని సమాచారం. ఈ మేరకు నివేదికలు అందుతున్నాయి. జెనీవా వేదికగా ఆదివారం శాంతి ఒప్పందం జరగవచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ ముసాయిదాలో ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తుందని, బిలియన్ల డాలర్ల ఇరాన్ నిధులను విడుదల చేస్తుందని.. లెబనాన్తో సహా అన్ని రంగాలలో శత్రుత్వానికి విరామం కల్పిస్తుందని ఒక సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్కు తెలిపారు. అణు సమస్యలను మాత్రం తర్వాత చర్చిస్తారని నివేదికలు అందుతున్నాయి.
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా, ఇరాన్లు ఆదివారం నాటికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉందని.. దీనికి జెనీవానే అత్యంత సంభావ్య వేదిక అని ఒక పాశ్చాత్య వర్గం శుక్రవారం రాయిటర్స్కు తెలిపింది. ఒప్పందం నిబంధనలను ఇంకా ఖరారు చేస్తున్నారని.. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాడుతున్న పోరాటాన్ని కూడా ఈ ఒప్పందంలో ముగించాలని ఇరాన్ పట్టుబడుతోందని వర్గాలు తెలిపాయి.
ఈ ఒప్పందాన్ని శనివారం నాటికి ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ -ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ దీనిపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. వేదికను ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. కానీ జెనీవా ఎంచుకోవచ్చని సమాచారం.

