Trump Tariffs: ఉత్పత్తుల దిగుమతులపై మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్న అమెరికా.. భారత్తో పాటు మరో 16 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) సెక్షన్ 301 కింద చేపట్టిన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సుంకాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. USTR తెలిపిన వివరాల ప్రకారం.. నిర్బంధ కార్మిక వ్యవస్థ ద్వారా తయారయ్యే ఉత్పత్తులను గుర్తించడం, వాటి దిగుమతులను అడ్డుకోవడం, సమర్థవంతమైన చట్టాలు అమలు చేయడంలో తగిన చర్యలు తీసుకోని దేశాలపై ఈ అదనపు టారిఫ్లు విధిస్తున్నారు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఆ కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అమెరికా స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు మొత్తం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. తొలుత భారత్పై 12.5 శాతం అదనపు సుంకం విధించే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ప్రచారం జరిగింది. అయితే కార్మిక ప్రమాణాల అమలుపై భారత్ చేపట్టిన చర్యలు, ఇరు దేశాల మధ్య జరిగిన సానుకూల చర్చల నేపథ్యంలో భారతదేశాన్ని 10 శాతం సుంకం శ్లాబ్లో చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో భారత్కు కొంత మేర ఊరట లభించినట్లైంది. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రపంచ సరఫరా చైన్ నుంచి నిర్బంధ కార్మిక వ్యవస్థ పూర్తిగా తొలగించబడలేదని పేర్కొన్నారు. అమెరికా ఇప్పటికే అలాంటి ఉత్పత్తుల దిగుమతులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోందని, తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా అదే స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
భారత్తో పాటు మరో 16 దేశాలు కూడా ఈ 10 శాతం అదనపు సుంకాల పరిధిలోకి వచ్చాయి. వీటిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, అర్జెంటీనా, కంబోడియా, కెనడా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హోండురాస్, ఇండోనేషియా, జోర్డాన్, మలేషియా, మెక్సికో, శ్రీలంక, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయి. మరోవైపు, కొన్ని ఇతర దేశాలు 12.5 శాతం వరకు అదనపు సుంకాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా నిర్ణయాన్ని ముందుగానే అంచనా వేసిన భారత్, అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా బలవంతపు కార్మిక వ్యవస్థతో తయారయ్యే ఉత్పత్తులను గుర్తించడం, పర్యవేక్షించడం కోసం ఇప్పటికే ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. దీంతో అమెరికా విధించే సుంకాల తీవ్రత కొంత వరకు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే వేర్వేరు రంగాల వారీగా ప్రత్యేక సుంకాలు అమల్లో ఉన్న ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ఈ కొత్త నిర్ణయం ప్రభావం చూపదని అమెరికా స్పష్టం చేసింది. అలాగే కొన్ని ఇంధన ఉత్పత్తులు, ఎరువులు, యూఎస్ఎంసీఏ (USMCA) ఒప్పందం కింద జరిగే వాణిజ్యం కూడా ఈ అదనపు టారిఫ్ల నుంచి మినహాయింపు పొందనున్నాయి.
అమెరికా తాజా నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో కార్మిక హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాల వాణిజ్య విధానాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

