US-Iran: ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు.. ఫొటోలు విడుదల

  • అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
  • ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
  • సోషల్ మీడియాలో ఫొటోలు విడుదల
Usiran

Usiran

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా వరుసగా వైమానిక దాడులు కొనసాగిస్తుండగా.. తాజాగా చాబహార్ పోర్టుపై జరిగిన దాడులకు సంబంధించిన ఫొటోను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిత్రంలో చాబహార్ పోర్టులోని ఒక టవర్ కూలిపోతున్న దృశ్యం కనిపించింది.

అంతర్జాతీయ వార్తా సంస్థ ఏపీ కథనం ప్రకారం.. ఈ ఫొటోను ముందుగా సామాజిక మాధ్యమాల్లో కొందరు కార్యకర్తలు షేర్ చేయగా.. అనంతరం పీట్ హెగ్‌సెత్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. భారత్ సహకారంతో అభివృద్ధి చేసిన ఇరాన్‌లోని కీలకమైన చాబహార్ పోర్టు ఇటీవల అమెరికా వైమానిక దాడులకు పలుమార్లు లక్ష్యంగా మారింది. ఈ పోర్టుపై మూడో విడత దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. అయితే టవర్ కూలిపోయిన విషయంపై మాత్రం వెంటనే స్పందించలేదు.

ఇరాన్ అధికారుల ప్రకారం.. కూలినట్లు చెబుతున్న టవర్ పోర్టులోకి వచ్చే వాణిజ్య నౌకల రాకపోకలను పర్యవేక్షించే కీలక కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా దేశంలోని పలు ప్రధాన పోర్టుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. ఇదిలా ఉండగా.. అమెరికా వరుసగా ఆరో రోజు రాత్రి కూడా ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించగా.. ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కొత్త దాడులు చేపట్టినట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. గత నెల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన తర్వాత ఇరు దేశాలు ప్రతిరోజూ పరస్పర దాడులకు దిగుతున్నాయి.

అమెరికా సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజా ఆపరేషన్‌లో ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్ సమీప ప్రాంతాల్లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ అతిపెద్ద వాణిజ్య నౌకాశ్రయం, నౌకాదళ స్థావరాలు, రివల్యూషనరీ గార్డ్స్ కేంద్రాలు ఉన్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో.. యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలతో కలిసి తీర నిఘా కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక లాజిస్టిక్స్ కేంద్రాలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలపై కచ్చితమైన దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలహీనపర్చడంతో పాటు వాణిజ్య నౌకలపై జరిగిన తాజా దాడులకు ఇరాన్‌ను బాధ్యుడిగా నిలబెట్టే చర్యలు కొనసాగుతున్నాయని సెంట్‌కామ్ (CENTCOM) పేర్కొంది. ప్రస్తుతం మధ్యప్రాచ్య ప్రాంతంలో 50 వేల మందికిపైగా అమెరికా సైనికులు మోహరించి ఉండగా.. వారు పూర్తి అప్రమత్తతతో సిద్ధంగా ఉన్నట్లు అమెరికా వెల్లడించింది.

 

https://x.com/PeteHegseth/status/2077956182665302280