బాల్య వివాహాల నిర్మూలన కోసం భారత్ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మొత్తానికి భారత్ పోరాటానికి అంతర్జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. నవంబర్ 27న ‘బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారత్లో కొనసాగుతున్న ఉద్యమానికి ఇది ప్రపంచవ్యాప్త మద్దతుగా భావిస్తున్నారు.
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ 2023 నుంచి ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వాలు, సమాజాన్ని కార్యాచరణ వైపు నడిపించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.
బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై సియెర్రా లియోన్ సెప్టెంబర్ 4న ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం ఆ తీర్మానానికి ఆమోదం లభించింది. నవంబర్ 27 తేదీకి భారత్కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 2024 నవంబర్ 27న భారత ప్రభుత్వం ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ ప్రచారాన్ని ప్రారంభించింది. అదే రోజును ఇప్పుడు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించడం విశేషం.
ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని స్వాగతించిన భువన్ రిభు.. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజని అన్నారు. తీర్మానం ఆమోదించే సమయంలో ఐక్యరాజ్యసమితికి ఆహ్వానించిన ఏకైక పౌర సమాజ ప్రతినిధి తానేనని తెలిపారు. 2024 నవంబర్ 27న బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారత్లో చేపట్టిన ప్రచారంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రతిజ్ఞ చేశారని రిభు పేర్కొన్నారు. పిల్లలు, స్థానిక సమాజాల నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఇచ్చి విస్తరించిందని చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు నిర్ణయాత్మక నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా అంతం చేయడంతో పాటు ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, అభివృద్ధి అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.
భారత్లో తగ్గుతున్న బాల్య వివాహాలు
దేశంలో బాల్య వివాహాల శాతం క్రమంగా తగ్గుతున్నట్లు జాతీయ స్థాయి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-21 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. 20-24 ఏళ్ల వయసున్న మహిళల్లో 23.3 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నారు. అదే NFHS-6 (2023-24)లో ఈ శాతం 20.1కి తగ్గింది. బాల్య వివాహాల నిర్మూలనలో దేశంలో జరుగుతున్న ప్రయత్నాల ప్రభావాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని భావిస్తున్నారు.
2026 నాటికి 10 శాతం తగ్గించడమే లక్ష్యం
భారత ప్రభుత్వం 2026 నాటికి దేశంలో బాల్య వివాహాల ప్రాబల్యాన్ని 10 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి బాల్య వివాహాలను నిర్మూలించాలన్న లక్ష్యం ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్-5 (లింగ సమానత్వం)లోని టార్గెట్ 5.3తో అనుసంధానమై ఉంది. బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాలతో పాటు అన్ని రకాల హానికరమైన ఆచారాలను నిర్మూలించడం ఈ లక్ష్యంలో భాగం.

