Iran War: మిడిల్ ఈస్ట్లో యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఇరాన్పై భూతల దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఇరాన్ దిగ్బంధించిన ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరిచేందుకు ఆపరేషన్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే, హార్ముజ్ జలసంధిని తెరవడానికి యూఏఈ, సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ లోని మిత్రదేశాలు అమెరికాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఇరాన్పై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చే విధంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం కోసం యూఏఈ లాబీయింగ్ చేస్తుందని చెప్పింది. ఈ జలసంధిని తెరవడానికి ఒక కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా, యూరప్, ఆసియాలోని సైనిక శక్తులను తమ దేశ దౌత్యవేత్తలు కోరినట్లు యూఏఈ అధికారులు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ పేర్కొంది. అమెరికా సన్నిహిత మిత్రదేశం బహ్రైయిన్ ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేస్తున్నట్లు, గురువారం దీనిపై ఓటింగ్ జరగనున్నట్లు సమాచారం.
Read Also: PM Modi: ఈ సాయంత్రం మోడీ కీలక భద్రతా సమావేశం.. పశ్చిమాసియాపై చర్చించే అవకాశం
గల్ఫ్ దేశాల ఆహారం, ఇతర ఎగుమతులు, దిగుమతలు ఈ హార్ముజ్ జలసంధిపై ఆధారపడి ఉన్నాయి. ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడి తర్వాత ఇరాన్ ఈ మార్గాన్ని కంట్రోల్ చేస్తోంది. నౌకలపై దాడులు చేస్తోంది. కొన్ని మిత్రదేశాలకు చెందిన నౌకల్ని మాత్రమే ఇరాన్ అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఈ యుద్ధంలో సౌదీ, యూఏఈ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు, ఇరాన్ను ఎదుర్కోవడానికి గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాలతో కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. ఈ ప్రకటన తర్వాత యూఏఈ యుద్ధంలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ‘‘నేను అరబ్ నాయకులతో రహస్యంగా మాట్లాడాను, ఇరాన్కు అవకాశం వస్తే మిమ్మల్ని జయించి, మీ రాజ్యాలను కూల్చివేస్తుందని చెప్పాను’’అని నెతన్యాహూ చెప్పడం విశేషం.
