ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్ దేశాలు శుక్రవారం సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఈ ఒప్పందంతో మూడు ప్రధాన ముస్లిం దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రాంతీయ భద్రతపై ప్రత్యక్ష అవగాహన ఉన్న వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ వివరాలను వెల్లడించింది. అయితే ఒప్పందం కింద ఒక్కో దేశం ఎలాంటి నిర్దిష్ట బాధ్యతలను స్వీకరిస్తుందనే దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. టర్కీకి చెందిన ఓ అధికారి కూడా ఈ రక్షణ ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు ధ్రువీకరించారు.
ఈ ఒప్పందం సంతకాల కార్యక్రమం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్నట్లు సమాచారం. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కలిసి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. టర్కీ నాటోలో సభ్యదేశంగా ఉండగా.. సౌదీ అరేబియా అమెరికాకు సన్నిహిత మిత్రదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో సౌదీ ఒకటి. పాకిస్థాన్ మాత్రం అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశంగా ఉంది. ఈ మూడు దేశాల మధ్య కుదరనున్న రక్షణ ఒప్పందానికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాల భద్రతా వ్యవస్థల్లో ఉన్న బలహీనతలను బయటపెట్టిన నేపథ్యంలో ఈ ఒప్పందం తెరపైకి వచ్చింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధి ద్వారా చమురు, ఇతర కీలక వస్తువుల రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంత దేశాల్లో భద్రతాపరమైన ఆందోళనలు మరింత పెరిగాయి. దాదాపు ఏడాది కాలంగా ఈ మూడు దేశాల మధ్య రక్షణ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. గత జనవరిలోనే ఈ చర్చలపై రాయిటర్స్ కథనం ప్రచురించింది. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ కూడా జనవరిలో విస్తృత ప్రాంతీయ భద్రతా వేదికకు టర్కీ మద్దతు ఇస్తుందని, దాని ద్వారా సహకారం, స్థిరత్వాన్ని పెంచాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రతిపాదిత కొత్త ఒప్పందం ఇప్పటికే పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య ఉన్న రక్షణ ఒప్పందానికి మరింత విస్తరణగా భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే.. అది రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించబడుతుంది. అలాగే అవసరమైన అన్ని సైనిక మార్గాలను ఉపయోగించుకునే అవకాశం ఈ ఒప్పందంలో ఉన్నట్లు గతంలో సౌదీ అధికారి ఒకరు రాయిటర్స్కు తెలిపారు. అయితే తాజా రక్షణ ఒప్పందంపై పాకిస్థాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు. సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇక ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.

