Donald Trump Dual Policy: ఇరాన్తో యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విదేశాంగ విధానంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటిస్తూనే, మరోవైపు మధ్యప్రాచ్యంలో సైనిక శక్తిని పెంచే చర్యలు చేపడుతున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా అదనంగా 10,000 మంది సైనికులను పంపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
అయితే ఇదే సమయంలో, రాబోయే 10 రోజుల పాటు ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరపబోమని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. చర్చలు కొనసాగుతున్నాయని, శాంతికి ఇంకా అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ, ఈ ప్రకటనలతో పాటు సైనిక మోహరింపు వార్తలు రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పెంటగాన్ కూడా ఈ పరిస్థితిలో కీలక పాత్ర పోషిస్తోంది. ట్రంప్కు మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంచేందుకు మధ్యప్రాచ్యానికి భూతల దళాలను పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఈ చర్యలు సూచిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అమెరికా తొలిసారిగా ఇరాన్కు వ్యతిరేక ఆపరేషన్లలో డ్రోన్ స్పీడ్బోట్ల వినియోగాన్ని అధికారికంగా అంగీకరించింది. ఈ మానవరహిత పడవలు ప్రధానంగా నిఘా కోసం ఉపయోగించబడుతున్నప్పటికీ, అవసరమైతే దాడుల కోసం కూడా వినియోగించవచ్చు. కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోంది. గతంలో Ukraine–Russia యుద్ధంలో ఇలాంటి డ్రోన్ పడవలు కీలక పాత్ర పోషించాయి. రష్యా నౌకాదళానికి గణనీయమైన నష్టం కలిగించిన తర్వాత, ప్రపంచ దేశాలు ఈ టెక్నాలజీపై మరింత దృష్టి సారించాయి.
ఇక ఇటీవల ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలో చమురు ట్యాంకర్లపై సముద్ర డ్రోన్ దాడులు జరిపినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మేరీల్యాండ్కు చెందిన బ్లాక్సీ సంస్థ రూపొందించిన మానవరహిత వ్యవస్థలను అమెరికా గస్తీ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నట్లు పెంటగాన్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి తెలిపారు. ఈ మొత్తం కార్యాచరణను “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”గా పిలుస్తున్నారు. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే, ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు సైనిక సన్నాహాలు కొనసాగించడం ద్వారా ట్రంప్ ప్రభుత్వం రెండు మార్గాల్లో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో మధ్యప్రాచ్య పరిస్థితులపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.
