అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి కలవబోతున్నారు. వైట్హౌస్ వేదికగా కీలక సమావేశం జరగబోతుంది. వచ్చే మంగళవారం సమావేశం కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలను మళ్లీ వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీ జరుగుతున్నట్లుగా వైట్హౌస్ అధికారికంగా ప్రకటించింది.
నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలపై ఇరు దేశాలు కీలకంగా చర్చించనున్నాయి. ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్ దాడులను నిలిపివేసే వాయు కాల్పుల విరమణ ప్రతిపాదనపై ట్రంప్, జెలెన్స్కీ మధ్య విస్తృతంగా చర్చలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. ఉక్రెయిన్, అమెరికా అధికారులు ఇప్పటికే వాయు కాల్పుల విరమణ ప్రతిపాదనపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రతిపాదనను రష్యా అధికారుల ముందుకు కూడా తీసుకెళ్లే అవకాశముందని సమాచారం. గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించినప్పటికీ.. తాజా పరిణామాలతో చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్న ప్రకారం.. రష్యాపై కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల వల్ల మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెరిగి, క్రెమ్లిన్ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ వారంలోనే జెలెన్స్కీ అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్తో సమావేశమై శాంతి చర్చల పునఃప్రారంభంపై చర్చించారు. అనంతరం అమెరికాలో మరిన్ని దౌత్య చర్చలు జరగనున్నాయని జెలెన్స్కీ ప్రకటించారు. ట్రంప్ సన్నిహితురాలు, రాజకీయ కార్యకర్త లారా లూమర్ కూడా జెలెన్స్కీతో ఇంటర్వ్యూ నిర్వహించినట్లు తెలిపింది. వచ్చే వారం అమెరికాకు వచ్చి ట్రంప్ను కలుస్తానని జెలెన్స్కీ తనతో చెప్పినట్లు ఆమె సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు.
లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియలకు హాజరు
అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ఇటీవల మృతి చెందగా ఆయన అంత్యక్రియలకు కూడా జెలెన్స్కీ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం వాషింగ్టన్లో స్మారక సభ నిర్వహించనుండగా.. ట్రంప్ అక్కడ ప్రసంగించనున్నారు. అనంతరం బుధవారం సౌత్ కరోలైనాలో అంత్యక్రియలు జరగనున్నాయి. రష్యా దాడులు ప్రారంభమైన 2022 నుంచి లిండ్సే గ్రాహమ్ ఉక్రెయిన్కు బలమైన మద్దతుదారుడిగా నిలిచారు. ఉక్రెయిన్కు అమెరికా సైనిక సహాయాన్ని పెంచాలని, రష్యాపై మరింత కఠిన ఆంక్షలు విధించాలని ఆయన నిరంతరం కోరుతూ వచ్చారు.
నెతన్యాహూ కూడా
ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కూడా వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం వాషింగ్టన్ చేరుకుని లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అనంతరం మంగళవారం వైట్హౌస్లో అధ్యక్షుడు ట్రంప్తో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.

