అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. ప్రస్తుతం ఇరాన్తో కీలక చర్చలు జరుగుతున్నాయని.. అవి విఫలమైతే మరింత తీవ్ర సైనిక చర్యలు చేపట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దౌత్యానికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇరాన్పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్తో చాలా లోతైన చర్చలు జరుగుతున్నాయి. అవి ఫలించకపోతే మరింత శక్తివంతమైన సైనిక చర్యలకు తిరిగి వెళ్తాం.’’ అని హెచ్చరించారు. చర్చలకు ఎంత సమయం ఇస్తారని ప్రశ్నించగా.. ఎక్కువ సమయం కాదు. చర్చలు వేగంగా ఫలించాలి.. లేదంటే అసలు అవసరమే లేదని స్పష్టం చేశారు.
ఇరాన్తో మధ్యవర్తిత్వం చేస్తున్న దేశాలు మరికొంత సమయం ఇవ్వాలని కోరడంతోనే అమెరికా దాడులను నిలిపివేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో వ్యవహరిస్తున్న దేశాలన్నీ ఇప్పుడు దాడులు చేయొద్దు అని కోరాయని.. అందుకే మరో అవకాశం ఇచ్చామని.. దీని వల్ల నష్టమూ లేదు.. లాభమూ లేదని చెప్పారు. దాడులు ఆగిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం, స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం కూడా సానుకూల సంకేతమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు ప్రధానంగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అలాగే అణు ఒప్పందంపై చర్చలను పునఃప్రారంభించడం చుట్టూనే కేంద్రీకృతమయ్యాయని ఆక్సియోస్ వెల్లడించింది. ఈ చర్చల్లో ఒమాన్ ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరిస్తుండగా.. ఖతార్, పాకిస్థాన్, ఈజిప్ట్తో పాటు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
అయితే అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను ఇరాన్ ఖండించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. ‘‘మధ్యవర్తులు అమెరికా సందేశాలను మాకు చేరవేయవచ్చు. కానీ ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు.’’ అని స్పష్టం చేశారు. ఇరాన్ చర్చలు కోరిందన్న వార్తలు కూడా అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇరాన్ చర్చలు కోరిందనే ప్రచారం పూర్తిగా కల్పితం. అమెరికా ఇటీవలి సంవత్సరాల్లో చట్టాలను గౌరవించని మాఫియా ముఠాలా వ్యవహరిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో సానుకూల చర్చలు జరుగుతాయని ఆశించడం కష్టం.’’ అని విమర్శించారు. హార్ముజ్ జలసంధి నిర్వహణ పూర్తిగా ఇరాన్, ఒమాన్ మధ్య అంశమేనని, దీనికి అమెరికాతో సంబంధం లేదని బఘాయీ స్పష్టం చేశారు. ‘‘హార్ముజ్ జలసంధి ఇప్పటికీ మూసివేసి ఉంది. దాని నిర్వహణ, సేవా రుసుముల వసూళ్లు పూర్తిగా ఇరాన్ పరిధిలోనే ఉంటాయి.’’ అని తెలిపారు.
గత 13 రోజుల పాటు కొనసాగిన అమెరికా వైమానిక దాడులు వారాంతంలో నిలిచిపోయాయి. అదే సమయంలో అమెరికా మిత్రదేశాలపై ప్రతీకార దాడులను కూడా నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సైన్య ప్రతినిధి మహ్మద్ అక్రమీనియా మాట్లాడుతూ.. ‘‘మా వ్యూహం ప్రతీకార చర్యలే. ప్రస్తుతం వాటిని కూడా నిలిపివేశాం.’’ అని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాట్లాడుతూ.. అమెరికా బలగాలు పూర్తిస్థాయి అప్రమత్తతలోనే ఉన్నప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ దౌత్యానికి కొంత అవకాశం ఇస్తున్నారని చెప్పారు.
నెతన్యాహుతో ట్రంప్ భేటీ
మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌస్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నేను అధ్యక్షుడిగా లేకపోయి ఉంటే ఇప్పటికి ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించి ఉండేది. ఇజ్రాయెల్ కూడా తీవ్ర ప్రమాదంలో పడేది.’’ అని వ్యాఖ్యానించారు. నెతన్యాహు కూడా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని పునరుద్ఘాటించారు. ‘‘అది యుద్ధం లేకుండానే సాధ్యమైతే మంచిదే. ఒప్పందంతో అయినా, ఒప్పందం లేకపోయినా ఇరాన్ అణు కార్యక్రమానికి ముగింపు పలకాల్సిందే.’’ అని అన్నారు. అయితే దౌత్యానికి అవకాశం ఇస్తున్నప్పటికీ, అది ఎక్కువ కాలం కొనసాగదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.

