Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్‌కు వార్నింగ్

  • ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది
  • ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్‌కు వార్నింగ్
  • ప్రస్తుతం ఇరాన్‌లో కొనసాగుతోన్న ఖమేనీ అంత్యక్రియలు
Ustrump

Ustrump

ప్రస్తుతం ఇరాన్‌లో మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతోంది. లక్షలాది మంది తరలివచ్చి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తి చేస్తా్మని ఘాటు హెచ్చరించారు.

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక చేశారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే అమెరికా ‘‘మిషన్‌ను పూర్తి చేస్తుంది’’ అంటూ స్పష్టం చేశారు. అయితే తాను ఇప్పటికీ చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నానని కూడా వెల్లడించారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఒప్పందం జరిగినా, జరగకపోయినా చివరికి గెలిచేది అమెరికానే అని అన్నారు. అయితే 9.1 కోట్ల మంది ఇరాన్ ప్రజలకు ఎలాంటి హాని జరగకూడదనే ఉద్దేశంతో తాను ఒప్పందానికే ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు.

ఇరాన్ ఇప్పటికే కొన్ని అంశాల్లో అమెరికాకు హామీలు ఇచ్చిందని, వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే చర్చల ప్రక్రియలో భాగంగా ఇరాన్ వద్ద ఉన్న అధిక స్థాయిలో శుద్ధి చేసిన యురేనియాన్ని కూడా అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల ఇరాన్‌పై చేపట్టిన చర్యల ఫలితంగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై అమెరికా చూపిన కఠిన వైఖరి కారణంగా చమురు ధరలు ఉద్రిక్తతలకు ముందున్న స్థాయికంటే కూడా తగ్గాయని పేర్కొన్నారు. అయితే ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు తీసుకురావాలన్న ఉద్దేశం తమకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చల ద్వారా పరస్పర అంగీకారంతో శాంతియుత పరిష్కారం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి వెల్లడించారు. ప్రస్తుతం ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి.

ఇదే సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా ట్రంప్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇద్దరూ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని తెలిపారు. యుద్ధానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితాల దిశగా సాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.