ఇరాన్పై భారీ దాడులు జరగొచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఇరాన్ చర్చలకు రావడంతో వెనక్కి తగ్గినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడ్డాయి.
తాజాగా సౌదీ అరేబియా ట్రంప్ ముందు కీలక అభ్యర్థన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇరాన్పై మరిన్ని దాడులు చేపట్టకుండా వెనక్కి తగ్గాలని సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు సౌదీ అరేబియా ప్రతిష్ఠాత్మక ఆర్థిక ప్రణాళిక ‘విజన్ 2030’పై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన రియాద్లో వ్యక్తమవుతోంది.
శనివారం ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన మొహమ్మద్ బిన్ సల్మాన్.. ఇరాన్లోని కీలక లక్ష్యాలపై అమెరికా మరిన్ని దాడులు చేపట్టే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి చేయడం, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు అంతరాయం కలగడం వంటి పరిణామాల నేపథ్యంలో.. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిశీలిస్తున్నట్లు ఆక్సియోస్ పేర్కొంది.
సౌదీ అరేబియా చేపట్టిన ‘విజన్ 2030’ కేవలం ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థను విభిన్న రంగాల్లో విస్తరించి, దీర్ఘకాలికంగా స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు రూపొందించిన సమగ్ర జాతీయ ప్రాజెక్ట్ అని రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా బిన్ ఫరాహ్ అల్-షయా పేర్కొన్నారు. పెట్టుబడులు, ఇంధనం, లాజిస్టిక్స్, పర్యాటకం, ఆవిష్కరణల రంగాల్లో సౌదీ అరేబియాను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అయితే ఇరాన్పై అమెరికా భారీ స్థాయిలో దాడులు చేపడితే గల్ఫ్ ప్రాంతం మొత్తం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన సౌదీ అరేబియాలో ఉంది. అమెరికా కొత్త దాడులకు దిగితే.. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని ఇంధన, కీలక మౌలిక సదుపాయాల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిస్పందించవచ్చని టెహ్రాన్ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో ప్రాంతీయ భద్రతతో పాటు సౌదీ ఆర్థిక ప్రణాళికలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమాసియాలో అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఇరు దేశాల మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ.. ఇరాన్తో ఉద్రిక్తతలను ఎలా పరిష్కరించాలనే అంశంపై అమెరికా చర్చల్లో సౌదీ అరేబియా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది.
అమెరికా మాజీ రక్షణ శాఖ అధికారి, పశ్చిమాసియా నిపుణురాలు డానా స్ట్రౌల్ మాట్లాడుతూ.. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల నుంచి ఎదురయ్యే ముప్పును కేవలం సైనిక చర్యలతో పూర్తిగా తొలగించలేమని సౌదీ అరేబియా గత అనుభవాల ద్వారా గుర్తించిందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ పలుమార్లు సైనిక చర్యలు చేపట్టినప్పటికీ హౌతీల ముప్పును పూర్తిగా నిర్మూలించలేకపోయాయని పేర్కొన్నారు.
‘‘ఏళ్ల తరబడి యుద్ధం చేసిన తర్వాత.. యెమెన్ నుంచి హౌతీలు సృష్టిస్తున్న ముప్పును కేవలం సైనిక శక్తితో పరిష్కరించలేమని సౌదీ అరేబియా కఠిన అనుభవంతో తెలుసుకుంది. ఇది కేవలం సౌదీ సైనిక సామర్థ్యాలకు సంబంధించిన అంశం కాదు. హౌతీల ముప్పు స్వభావం, వారికి ఇరాన్ నుంచి లభిస్తున్న మద్దతు, యెమెన్లో వారు బలంగా పాతుకుపోయిన పరిస్థితులు కూడా కీలకమే’’ అని స్ట్రౌల్ పేర్కొన్నారు.
సౌదీ అరేబియా మరోసారి హౌతీలతో పెద్ద ఎత్తున ఘర్షణలోకి దిగితే.. ‘విజన్ 2030’ ప్రాజెక్టుల అమలుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని డానా స్ట్రౌల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో భారీ పెట్టుబడులు, పర్యాటక ప్రాజెక్టులు, కొత్త నగరాల నిర్మాణం వంటి కార్యక్రమాలకు సౌదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. ప్రాంతీయ యుద్ధం ఆర్థిక లక్ష్యాలకు అడ్డంకిగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా అధికారులతో చర్చలు జరిపారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసినా.. అలాంటి దాడులకు ఇతర దేశాలు మద్దతు ఇచ్చినా తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం.
మరోవైపు ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తోంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి మార్గాలను అన్వేషిస్తూ ఖతార్ అధికారులు ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాటు ఒమన్ అధికారులతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా సాధారణ స్థితికి రావడం కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

