Trump-Pakistan: ట్రంప్‌తో పాకిస్థాన్‌కు కొత్త సంకటం.. సౌదీకి షరీఫ్, మునీర్!

  • ట్రంప్‌తో పాకిస్థాన్‌కు కొత్త సంకటం
  • శాంతి ఒప్పందంలో ట్రంప్ కొత్త మెలిక
  • లబోదిబో అంటున్న దాయాది పాకిస్థాన్
  • సౌదీ అరేబియాకు షరీఫ్, మునీర్!
Trump

Trump

దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది అన్నట్టుగా ఉంది. దీన్నే అంటారు.. ఎరక్కపోయి ఇరుక్కు పోవడమంటే. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాలని పాకిస్థాన్ ముందుకొచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాలు చర్చలు కూడా జరిపారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే అకస్మాత్తుగా ట్రంప్ సరికొత్త మెలిక పెట్టారు. దీంతో పాకిస్థానే కొత్త ఇరకాటంలో పడిపోయింది. అసలేం జరిగిందంటే..

×
×
Ad

ఇరాన్‌తో శాంతి చర్చలు జరగాలంటే అరబ్‌ దేశాలు చారిత్రక అబ్రహాం అకార్డ్స్‌లో తప్పనిసరిగా చేరాల్సిందేనని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘‘సౌదీ అరేబియా, ఖతార్‌, పాకిస్థాన్‌, తుర్కియే, జోర్డాన్‌ దేశాలు తక్షణమే అబ్రహాం అకార్డ్స్‌పై సంతకం చేయాలి. పశ్చిమాసియాలో ఆర్థిక, సామాజిక పురోగతికి ఈ అకార్డ్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దీనిపై సౌదీ, ఖతార్‌ తొలుత సంతకాలు చేయాలి. మిగతా దేశాలు కూడా వీటిని అనుసరించాలి. ఇరాన్‌ కూడా ఇందులో చేరితో అది చాలా గొప్ప విషయం అవుతుంది’’ అని ట్రంప్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

అయితే ఈ అబ్రహాం అకార్డ్స్ ప్రకారం.. ఇజ్రాయెల్‌ను గుర్తించడంతో పాటు దౌత్య సంబంధాలు బలోపేతం చేయడం దీని ఉద్దేశం. ఇప్పటికే ఈ ఒప్పందాలపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, సూడాన్‌, మొరాకో సంతకాలు చేశాయి. ఇప్పుడు దీన్ని మరింత విస్తరించాలని ట్రంప్‌ భావిస్తున్నారు. అయితే గాజాపై ఇజ్రాయెల్‌ సైనిక చర్యను మెజార్టీ ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాలు కొనసాగించలేమని ఇప్పటికే సౌదీ తేల్చి చెప్పింది. అయితే ఒప్పందంలో చేరితే షరీఫ్‌ను, అసిమ్ మునీర్‌ను చంపేస్తామని ఉగ్రవాద సంస్థలు బహిరంగంగా హెచ్చరిస్తున్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్ అంతటా భారీ రణరంగమే జరిగే అవకాశం ఉంది. దీంతో పాక్ ప్రభుత్వం గిజగిజ కొట్టుకుంటోంది.

అబ్రహాం ఒప్పందంలో చేరితే పాకిస్థాన్‌లో తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ సౌదీ అరేబియాకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అబ్రహాం అకార్డ్స్‌పై చర్చించే అవకాశం ఉంది. సౌదీ నిర్ణయం ప్రకారం ముందుకు సాగాలని పాకిస్థాన్ భావిస్తోంది. సౌదీ ఏ నిర్ణయం తీసుకుంటే.. ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతానికి పాకిస్థాన్ అబ్రహాం అకార్డ్స్‌లో చేరే సూచనలు కనిపించకపోయినా.. అంతర్జాతీయ రాజకీయ మార్పులు, అమెరికా ఒత్తిడి, మధ్యప్రాచ్య సమీకరణల నేపథ్యంలో ఈ అంశం ఇస్లామాబాద్‌కు పెద్ద దౌత్య సవాలుగా మారనుంది. ఒకవైపు భౌగోళిక రాజకీయ అవసరాలు.. మరోవైపు దేశీయ మత, రాజకీయ ఒత్తిళ్ల మధ్య పాకిస్థాన్ నాయకత్వం చిక్కుకుపోయిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.