మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీని అంతమొందించింది. దీంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అయితే వీటిని ఎదుర్కోవడానికి అమెరికా భారీ వ్యయాన్ని ఖర్చు చేస్తున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ సుమారు 20,000 డాలర్ల విలువైన Shahed-136 డ్రోన్లు ప్రయోగించింది. అయితే వీటిని ఎదుర్కొనేందుకు అమెరికా MIM-104 Patriot క్షిపణులు ఉపయోగిస్తోంది. దీని విలువ ఒక్కొక్కటి సుమారు 4 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో కూడిన భారీ సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించి.. అమెరికా నుంచి ఖరీదైన క్షిపణి నిల్వలను ఖాళీ చేయిస్తోంది. దీంతో అమెరికా రక్షణ వనరులపై భారాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా క్షిపణులు 90 శాతం కంటే ఎక్కువ ముప్పులను విజయవంతంగా అడ్డుకుంది. అందుకోసం అమెరికా చాలా ఎక్కువ ఖర్చు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక ఇరాన్కు చెందిన షాహెద్-136 డ్రోన్లు దూర ప్రయాణ సామర్థ్యంతో లక్ష్యాన్ని ఢీకొని పేలే విధంగా రూపొందించబడ్డాయి. ఈ డ్రోన్లు అమెరికా సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలు, భవనాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. తక్కువ ఖర్చు ఆయుధాలతో అధిక ఖర్చు రక్షణ వ్యవస్థలను సవాలు చేయడం అనే ఈ విధానాన్ని ‘అసమాన యుద్ధ వ్యూహం’గా రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.
టెహ్రాన్పై తొలిసారి చేసిన దాడి కోసం అమెరికా అక్షరాల 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. భారత కరెన్సీలో అక్షరాల రూ.6,900 కోట్లు ఖర్చు చేసినట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. యుద్ధం ఇలానే కొనసాగితే ట్రంప్ మరిన్ని కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. ఖతార్ దగ్గర ఉన్న పేట్రియట్ ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలు నాలుగు రోజులు మాత్రమే సరిపోతాయని తెలిపింది. ఖతార్ ఇంటర్నేషనల్ మీడియా ఆఫీస్ మాత్రం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రకటించింది. గత ఏడాది ఇజ్రాయెల్తో జరిగిన ఘర్షణల తర్వాత ఇరాన్ దగ్గర సుమారు 2,000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా. షాహీద్ డ్రోన్ల సంఖ్య మాత్రం మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భద్రతా కేబినెట్ సభ్యుడు ఎలి కోహెన్ ప్రకారం.. ఇరాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించకుండా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు అడ్డుకున్నాయని.. ఇప్పటివరకు 150 క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రస్తుత దాడుల తీవ్రత ఇదే విధంగా కొనసాగితే.. ప్రాంతీయంగా పేట్రియట్ క్షిపణుల నిల్వలు కొద్ది రోజుల్లో ప్రమాదకర స్థాయికి చేరవచ్చని రక్షణ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల నిల్వలు కూడా తగ్గిపోతే యుద్ధం స్థంభన దశకు చేరే అవకాశముంది.
