US-Iran agreement: ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం దాదాపుగా పూర్తయిందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి త్వరలో తెరుచుకుంటుందని తెలిపారు. అమెరికా, ఇరాన్, ఇతర దేశాల మధ్య ఒప్పందం దాదాపుగా పూర్తయిందని, చివరి దశ చర్చలు మాత్రమే మిగిలి ఉన్నాయని తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. మధ్యప్రాచ్యంలోని కీలక నేతలతో చర్చలు జరిగాయని ఆయన అన్నారు.
Read Also: Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, పాకిస్తాన్ సైనిక అధిపతి అసిమ్ మునీర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాలతో పాటు ఇతరులతో తాను ఓవల్ ఆఫీస్ నుండి చర్చలు జరిపినట్లు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో తాను విడిగా మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు.
అయితే, ట్రంప్ చేస్తున్న వాదనల్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ జలసంధి పూర్తిగా తిరిగి తెరుచుకుంటుందనే ట్రంప్ వ్యాఖ్యలకు.. ఈ జలమార్గం తమ ఆధీనంలోనే ఉంటుందని ఇరాన్ చెప్పింది. ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని చెప్పింది. ఏ ఒప్పందమైన హార్ముజ్ జలసంధి కంట్రోల్ తమ చేతుల్లోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ యుద్ధం ముగిసేందుకు గానూ ఒక అవగాహన ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇరాన్ చెప్పింది. ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం తమకు అప్పగించాలని అమెరికా కోరుతుంటే, ఇచ్చేది లేదని ఇరాన్ చెబుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
