అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గమైన హార్ముజ్ జలసంధి ద్వారా సాధారణ నౌకాయానం పునరుద్ధరించబడుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ స్పందిస్తూ.. చమురుతో నిండిన నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి సురక్షితంగా ప్రయాణం ప్రారంభించాయని పేర్కొన్నారు.
“చమురుతో నిండిన నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి బయటకు కదలడం ప్రారంభించాయి. అవి దక్షిణ మార్గం (సదర్న్ హైవే) ద్వారా ప్రయాణిస్తున్నాయి. ఆ మార్గం పూర్తిగా సురక్షితమైనది, భద్రమైనది. ఇతర ప్రయాణ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి” అని పేర్కొన్నారు.
టోల్ ఫీజులు ఉండవు: జేడీ వాన్స్
ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా హార్ముజ్ జలసంధి అంశంపై స్పందించారు. భవిష్యత్తులో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఎలాంటి టోల్ ఫీజులు విధించదని అమెరికా ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధిని దీర్ఘకాలికంగా టోల్ రహితంగా తెరిచి ఉంచడమే తమ లక్ష్యమని చెప్పారు. “హార్ముజ్ జలసంధి దీర్ఘకాలికంగా టోల్ ఫ్రీగా అందుబాటులో ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ అంశాన్ని సాంకేతిక స్థాయి చర్చల్లో మరింత స్పష్టంగా ఖరారు చేస్తాం” అని వాన్స్ పేర్కొన్నారు.
మార్కెట్లకు ఊరట
హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం గుండా వెళ్తుంది. ఇటీవల అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు నెలకొనగా.. ఇప్పుడు నౌకాయానం పునరుద్ధరణపై వస్తున్న సంకేతాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరటనిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. తాజా పరిణామాలు చర్చలు తుది దశకు చేరుకున్నాయని సూచిస్తున్నాయి.

