Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?

  • మాస్కోకు ట్రంప్ దూతలు
  • యుద్ధం ముగింపుపై చర్చలు
  • పుతిన్ మెత్తబడతారా?
Russiaukrainewar

Russiaukrainewar

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా ప్రత్యేక దూతలు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం మాస్కోకు చేరుకున్నారు. యుద్ధాన్ని ముగించేందుకు ఓ ప్రతిపాదనను వెంట తీసుకువెళ్లినట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఈ పర్యటనతో పెద్దగా పురోగతి సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని క్రెమ్లిన్‌కు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

పుతిన్ షరతులు?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు అనుకూలమైన షరతులతోనే యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వ్యక్తులు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యాకు సైనికంగా పైచేయి ఉందని మాస్కో భావిస్తుండటంతో.. గతంతో పోలిస్తే ఇప్పుడు తన డిమాండ్లను మరింత కఠినతరం చేస్తోందని వారు తెలిపారు. సున్నితమైన అంశం కావడంతో తమ పేర్లను వెల్లడించేందుకు వారు నిరాకరించారు.

తక్కువ అంచనాలు

విట్‌కాఫ్, కుష్నర్ గతంలో కూడా రష్యాలో పర్యటించినప్పటికీ ఎలాంటి గణనీయమైన పురోగతి సాధించలేకపోయారు. దీంతో ఈసారి కూడా వారు తీసుకువచ్చే ప్రతిపాదనలతో పెద్దగా మార్పు వస్తుందన్న ఆశలు లేవని క్రెమ్లిన్‌కు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే శుక్రవారం ఓవల్ ఆఫీసులో మాట్లాడిన ట్రంప్ మాత్రం.. తన దూతలు “యుద్ధాన్ని ముగించే ప్రతిపాదనను తీసుకువెళ్తున్నారు” అని తెలిపారు. ప్రతిపాదనకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఆదివారం ఉక్రెయిన్‌కు..

మాస్కో పర్యటన అనంతరం విట్‌కాఫ్, కుష్నర్ ఆదివారం ఉక్రెయిన్‌కు రానున్నట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత వారు ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. ఈ పర్యటనను సాధ్యమైనంత నిర్మాణాత్మకంగా, ఫలప్రదంగా మార్చేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తుందని జెలెన్‌స్కీ చెప్పారు. అమెరికా అధికారులు ఉక్రెయిన్‌లో ఉన్న సమయంలో అవసరమైన కాలవ్యవధిలో తమ దేశం వైమానిక దాడులను నిర్వహించబోదని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా కూడా ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఉక్రెయిన్ ఆశిస్తోందన్నారు.

ఇదిలా ఉండగా.. శనివారం ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ప్రకారం.. రష్యా రాత్రికి రాత్రే ఉక్రెయిన్‌పై ఇస్కాండర్-ఎం, కేఎన్-23 బాలిస్టిక్ క్షిపణులతో పాటు 167 డ్రోన్లతో దాడులు చేసింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని స్టీల్ మిల్లులు, కీవ్‌కు సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్‌ఫీల్డ్ దగ్గర ఉన్న ఇంధన నిల్వ కేంద్రాలు ఈ దాడుల్లో లక్ష్యాలుగా ఉన్నాయి. కీవ్, సమీపంలోని బోరిస్పిల్‌లోని విమానాశ్రయాలపై జరిగిన రష్యా దాడులను జెలెన్‌స్కీ “ప్రదర్శనాత్మక దాడులు”గా అభివర్ణించారు. అమెరికా అధికారులు విమానంలో ఉక్రెయిన్‌కు వచ్చి కీవ్ లేదా బోరిస్పిల్ విమానాశ్రయంలో దిగే అవకాశాలపై జరుగుతున్న చర్చలకు ప్రతిస్పందనగానే రష్యా విమానాశ్రయాలపై దాడులు చేసిందని ఆయన ఆరోపించారు. రష్యా-ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్ల ద్వారా అమెరికా దౌత్యానికి సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. “ఉక్రెయిన్ శాంతిని మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉంది” అని జెలెన్‌స్కీ తెలిపారు.

పెద్దగా ఆశలు లేవు

మరోవైపు విట్‌కాఫ్, కుష్నర్ పర్యటనతో అర్థవంతమైన పురోగతి సాధించడంపై ఉక్రెయిన్‌లోనూ ఆశలు తక్కువగానే ఉన్నాయని అక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి. అమెరికా దూతలు గతంలో ప్రతిపాదించిన కొన్ని అంశాలను మళ్లీ చర్చకు తీసుకురావచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా డాన్‌బాస్ ప్రాంతాన్ని ఆర్థిక స్వేచ్ఛా మండలంగా మార్చే ప్రతిపాదనను వారు ముందుకు తెచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను రష్యా ఇప్పటికే తిరస్కరించింది.

ఇదే సమయంలో ఉక్రెయిన్ కూడా రష్యాపై డ్రోన్ దాడులను కొనసాగించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. మాస్కో సహా తొమ్మిది ప్రాంతాల్లో 53 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. అయితే గత కొన్ని రోజులతో పోలిస్తే ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తీవ్రత కొంత తగ్గినట్లు సమాచారం. గతంలో కీవ్ వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగిస్తూ రష్యాలోని పలు లక్ష్యాలను టార్గెట్ చేసింది. ప్రస్తుతం అందరి దృష్టి విట్‌కాఫ్, కుష్నర్ మాస్కో చర్చలపైనే ఉంది. ఈ పర్యటన రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా ఏమైనా పురోగతికి దారితీస్తుందా లేదా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.