Thailand Train Crash: బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి

  • బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం
  • బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు
  • 8 మంది మృతి.. పలువురికి గాయాలు
Thailandtraincrash

Thailandtraincrash

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శనివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గూడ్స్ రైలు ప్రజా రవాణా బస్సును ఢీకొట్టడంతో కనీసం 8 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నగరంలోని ఎయిర్‌పోర్ట్ రైల్ లింక్ స్టేషన్ సమీపంలో సాయంత్రం సమయంలో జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై బ్యాంకాక్ అత్యవసర వైద్య సేవల సంస్థ ఎరవాన్ మెడికల్ సెంటర్ స్పందించింది. ఇప్పటివరకు 8 మంది మృతిచెందగా.. 20 మందికి పైగా గాయపడినట్టు వెల్లడించింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బస్సులోనే మృతదేహాలు
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన థాయ్‌లాండ్ ఉప రవాణా శాఖ మంత్రి సిరిపోంగ్ అంగ్కసాకుల్‌కియాట్ మాట్లాడుతూ.. ‘‘మృతదేహాలన్నీ బస్సులోనే లభించాయి. బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.’’ అని తెలిపారు. బస్సు రైల్వే ట్రాక్‌పైనే ఆగిపోయిందా? రైల్వే గేట్లు సరిగా మూసుకోలేదా? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

వీడియోలు వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనాలు వరుసగా నిలిచి ఉండగా.. వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఆరెంజ్ రంగు బస్సును ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్ర ప్రభావంతో బస్సుతో పాటు పక్కనే ఉన్న పలు వాహనాలు కూడా ట్రాక్‌ల వెంట లాగుకెళ్లాయి. అనంతరం బస్సుకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో అక్కడున్న పలువురు బైక్ రైడర్లు గాల్లోకి ఎగిరిపడి రోడ్డుపై పడిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం సహాయక సిబ్బంది కాలిపోయిన బస్సులోకి ప్రవేశించి సహాయక చర్యలు చేపట్టారు.

థాయ్‌లాండ్ మీడియా కథనాల ప్రకారం.. గూడ్స్ రైలు దక్షిణ చాచోయెంగ్‌సావో ప్రావిన్స్ నుంచి బ్యాంకాక్‌లోని బాంగ్ సూయే ప్రాంతానికి వెళ్తోంది. ప్రమాదానికి గురైన బస్సు బ్యాంకాక్ తూర్పు శివార్ల నుంచి నగర కేంద్రానికి నడిచే సర్వీస్‌గా గుర్తించారు.

ఈ ఏడాది జనవరిలో కూడా బ్యాంకాక్ సమీపంలో ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనుల కోసం ఉపయోగించే భారీ క్రేన్ ఓ ప్రయాణికుల రైలుపై కూలిపోవడంతో కనీసం 28 మంది మరణించగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటనపై కూడా థాయ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది.