Nepal: నేపాల్‌లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు.. దుబాయ్‌కు పారిపోయేందుకు ప్రధాని కేపీ శర్మ ఏర్పాట్లు!

  • నేపాల్‌లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు
  • దుబాయ్‌కు పారిపోయేందుకు ప్రధాని కేపీ శర్మ ఏర్పాట్లు!
Gen Z

Gen Z

నేపాల్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా దళాలు-నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిరసనలకు దిగొచ్చి… సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తేసింది.

అయినా కూడా రెండో రోజు ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ఖాట్మండ్‌లో ఉద్రిక్తలు ఉధృతం అయ్యాయి. పార్లమెంట్ ముందు నిరసనకారులు చెలరేగిపోయారు. వీధుల్లో రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించారు. నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ప్రధాని కేపీ శర్మ ఓలి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన విమానాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.

కర్ఫ్యూ అమల్లో ఉన్న కూడా నిరసనకారులు పోలీసులతో గొడవలకు దిగుతున్నారు. ప్రభుత్వంలో ‘‘హంతకులను శిక్షించండి.. పిల్లలను చంపడం ఆపండి’’ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారుల మరణాలకు కారణమైన ప్రధాని ఓలి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గగన్ థాపా డిమాండ్ చేశారు.

నిరసనలకు కారణం ఇదే..
దేశంలో ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా పలు సోషల్ నెట్‌‌వర్కులపై గత వారం ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఖాట్మండులో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఈ ఘటనలో 20 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ‘‘సోషల్ మీడియాపై నిషేధం కాదు.. అవినీతిపై నిషేధం విధించండి’’ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలుు చేశారు. దాదాపు 10 వేల మందికి పైగా జనాలు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు.