Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు

  • శ్రీలంక ఈస్టర్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు..
  • మాజీ గూఢచార అధిపతి కుట్రకు సహకరించినట్లు ఆరోపణలు..
  • స్వయంగా ప్రకటించిన శ్రీలంక ప్రభుత్వం..
  • మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రమేయం.?
2019 Easter Bombings

2019 Easter Bombings

Sri Lanka: శ్రీలంకలో 2019లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ద్వీప దేశ చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రవాద దాడిగా నిలిచింది. ఈ దాడిలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడికి సంబంధించి దేశాన్ని రక్షించాల్సిన వారే కుట్ర పన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మారణకాండ వెనక దేశ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పాత్ర ఉందని శ్రీలంక ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఆనంద విజయపాల పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మాజీ మేయర్ జనరల్ తువాన్ సురేష్ సల్లే ఇస్లామిక్ ఉగ్రవాదులతో చేతులు కలిపి కుట్ర పన్నినట్లు, వారికి వ్యూహాత్మక దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు. దాడులకు కొన్ని వారాలల ముందు సురేస్ సల్లే కొందరు ముస్లిం వ్యక్తులతో కలిసి చర్చి వివరాలు, ప్రార్థనలకు హాజరయ్యే భక్తుల వివరాలను తెలుసుకున్నట్లు మంత్రి చెప్పారు.

మాజీ అధ్యక్షుడికి సంబంధం.?

ఈ కేసు సురేష్ సల్లేకే కాకుండా, ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటయబ రాజపక్సే వరకు చేరింది. సల్లే విచారణ తర్వాత గోటబయను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. గోటబయ దేశం వదిలి వెళ్లకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2023లో బ్రిటిష్ మీడియా సంస్థ ఛానెల్-4 కూడా గోటబయపై సంచలన కథనాన్ని వెల్లడించింది. ఈ ఉగ్రవాద దాడి ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్సకు రాజకీయ ప్రయోజనం కలిగించిందని తెలిపింది. సల్లే దాడులకు పాల్పడిన తీవ్రవాదులతో ముందుగానే సంప్రదింపులు జరిపినట్లు ఆరోపించింది. ఈస్టర్ దాడుల తర్వాత గోటబయ రాజపక్స అధ్యక్ష బరిలోకి దిగి, తాను అధికారంలోకి వస్తే తీవ్రవాదాన్ని అణచివేస్తానని హామీ ఇచ్చి, ఘన విజయం సాధించారు. రాజపక్స అధ్యక్షుడు అయిన వెంటనే 2019లో దేశ ప్రధాన గూఢచార సంస్థ స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వీస్(ఎస్ఐఎస్)కు సల్లే అధిపతిగా నియమితులు అవ్వడం గమనార్హం. ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన సైనిక గూఢచార విభాగానికి చీఫ్‌గా వ్యవమరించారు.

×
×
Ad

శ్రీలంకలో అతిపెద్ద ఉగ్రదాడి..

2019 ఏప్రిల్ 21న ఆదివారం ఈస్టర్ రోజు రాజధాని కొలంబోలో అతిపెద్ద ఉగ్రవాద దాడి జరిగింది. కొలంబోలోని మూడు లగ్జరీ హోటళ్లు, రెండు కాథలిక్ చర్చిలు, ఒక ప్రొటెస్టెంట్ చర్చిలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 279 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.