NTV Telugu Site icon

Khaleda Zia: బంగ్లాదేశ్ ప్రధానిగా ఖలీదా జియా? బ్యాగ్రౌండ్ ఇదే..!

Khaledazia

Khaledazia

బంగ్లాదేశ్‌లో రాజకీయలు శరవేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా.. బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియా (78)  మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న ఆమెను విడిచిపెట్టాలని అధ్యక్షుడు మహమ్మద్‌ షాబుద్దీన్ ఆదేశాలు ఇవ్వడంతో విడుదలయ్యారు.

హసీనా దేశాన్ని విడిచివెళ్లగానే విదేశీ విరాళాల కుంభకోణం కేసులో పదిహేడేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న జియా విడుదలకు అధ్యక్షుడు మహమ్మద్‌ షాబుద్దీన్ ఆదేశాలు ఇచ్చారు. ఖలీదా జియా మూడుసార్లు ప్రధానిగా పని చేసిన అనుభవం ఉంది.

ఖలీదా జియా ఎవరు?
ఖలీదా జియా (78) బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధానమంత్రి. 1991లో ప్రధాని బాధ్యతలు చేపట్టింది. 1996లో జియా రెండోసారి గెలిచారు. కేవలం 12 రోజులు మాత్రమే ప్రధాని పదవిలో కొనసాగింది. అటు తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తిరిగి ఐదేళ్ల తర్వాత ఖలీదా జియా అధికారంలోకి వచ్చింది. 2007లో అవినీతి ఆరోపణలపై జియా అరెస్ట్ అయింది. 2018లో ఆమెను కోర్టు దోషిగా తేల్చడంతో జైలుకెళ్లింది. అనేక ఆరోగ్య సమస్యలు కారణంగా ఎక్కువ కాలంలో ఆస్పత్రిలోనే గడిపింది.

భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన జల్‌పాయీగుడీలో ఆగస్టు 15, 1945లో ఖలీదా జియా జన్మించింది. ఆమె భర్త లెఫ్టినెంట్ జనరల్ జియావుర్‌ రెహమాన్‌. క్రూరమైన మిలిటరీ అధికారిగా పేరు గాంచారు. 1977 నుంచి 1981 వరకు బంగ్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1981లో హత్యకు గురికావడంతో జియో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీకి అధ్యక్షురాలిగా కొనసాగారు. 2018లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో జియోకు పదిహేడేళ్ల జైలుశిక్ష పడింది. ఆ శిక్షతో ఆమె ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా మారారు. ప్రస్తుతం 78 ఏళ్ల జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈమెనే తిరిగి బంగ్లాదేశ్ ప్రధాని బాధ్యతలు చేపట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఏం జరుగుతుంతో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇదిలా ఉంటే కోటా ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవిని వదులుకుని భారత్‌కు వచ్చేశారు. ఇక్కడ నుంచి యూకే వెళ్లి నివాసించాలని ఆమె భావిస్తు్న్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.