Sheikh Hasina: హంతకుడు, ఫాసిస్ట్ మహ్మద్ యూనస్ నిర్వహించి బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికల్ని రద్దు చేయాలని మాజీ ప్రధాని షేక్ హసీనా డిమాండ్ చేశారు. యూనస్ వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన 18 నెలల తర్వాత బంగ్లాలో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 12న జరిగాయి.
ఎన్నికలపై తన స్పందన తెలియజేస్తూ.. “ఈ ఓటర్లు లేని, చట్టవిరుద్ధమైన మరియు రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికలను రద్దు చేయాలని, యూనస్ రాజీనామా చేయాలని; తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, రాజకీయ ఖైదీలతో పాటు ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మేధావులు, నిపుణులను విడుదల చేయాలని, అవామీ లీగ్ కార్యకలాపాలపై విధించిన సస్పెన్షన్ను తొలగించాలని, తటస్థ కేర్టేకర్ ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుకొని ఎన్నికలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల ఓటు హక్కులను పునరుద్ధరించాలని’’ ఆమె డిమాండ్ చేశారు.
Read Also: BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
ఎన్నికలు యూనస్ నిర్వహించిన ఒక మోసపూరిత కార్యక్రమంగా ఆమె అభివర్ణించారు. చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా యూనస్ నిర్వహించి ఎన్నికలు జాగ్రత్తగా ప్లాన్ చేసిన ప్రహసనం అని ఆమె ఆరోపించారు. ప్రజల ఓటింగ్ హక్కుల్ని, ప్రజాస్వామ్య విలువను, రాజ్యాంగ స్పూర్తిని విస్మరించారని, అవామీ లీగ్, ఓటర్లు లేకుండా ఎన్నికల్ని నిర్వహించారని అన్నారు. ఫిబ్రవరి 11 సాయంత్రం నుంచే అక్రమాలు ప్రారంభమయ్యాయని, పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం, కాల్పులు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు.
ఓటింగ్ రోజు దేశవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఢాకాతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూర్తిగా ఓటర్లు లేరని ఆమె అన్నారు. 11 గంటలకు ఓటింగ్ శాతం 14.96గా ఉందని, ఓటింగ్ ఎక్కువగా ఉండే సమయంలోనే ఇంత తక్కువ ఓటింగ్ ఉందని, అవామీ లీగ్ లేకుండా జరుగుతున్న ఎన్నికల్ని ప్రజలు తిరస్కరించడానికి ఇదే రుజువు అని చెప్పారు. అవామీ లీగ్ ఓటర్లు, మద్దతుదారుల్ని, మైనారిటీలను బలవంతంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు దాడులు, అరెస్టులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు.
