Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్‌పవార్ ప్రశంసలు

  • విదేశాల్లో కొనసాగుతోన్న మోడీ పర్యటన
  • ప్రస్తుతం రోమ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
  • మోడీ విదేశీ పర్యటనలపై శరద్ పవార్ ప్రశంసలు
Sharadpawar

Sharadpawar

ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తున్న వేళ.. మిత్రపక్షమైన ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రసంశల జల్లు కురింపించారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా.. దేశ గౌరవాన్ని కాపాడే విషయంలో రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. విదేశాల్లో భారత ప్రతిష్ఠను నిలబెట్టేందుకు ప్రధాని మోడీ పని చేస్తున్నారని శరద్ పవార్ ప్రశంసించారు.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో శరద్ పవార్ మాట్లాడారు.. ‘‘దేశ గౌరవాన్ని కాపాడే విషయంలో రాజకీయ విభేదాలను తీసుకురావద్దు. ప్రధాని మోడీ విదేశాల్లో భారత ప్రతిష్ఠను నిలబెట్టేందుకు పని చేస్తున్నారు. మనకు రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ దేశ గౌరవం విషయంలో రాజకీయాలు అడ్డురాకూడదు’’ అని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేసే అవకాశం వస్తే అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, పీవీ.నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశ భవిష్యత్తు, ప్రతిష్ఠను ఎప్పుడూ ముందుంచుకుని నాయకత్వం వహించారని పేర్కొన్నారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సోవియట్ యూనియన్ పర్యటన సందర్భంగా భారత గౌరవం విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించారో కూడా శరద్ పవార్ వివరించారు. ‘‘నేను 40 కోట్ల భారతీయులను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. వారి గౌరవానికి భంగం కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను’’ అని ఇందిరాగాంధీ అప్పట్లో చెప్పినట్లు గుర్తుచేశారు.

ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కొనసాగుతోంది. ఐదు దేశాల పర్యటన కోసం ఈనెల 15న భారత్ నుంచి బయల్దేరి వెళ్లారు. మంగళవారం నార్వే పర్యటన ముగించుకుని ఇటలీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఇప్పటి వరకు నాలుగు దేశాల్లో పర్యటించగా.. చివరి పర్యటనగా రోమ్‌లో పర్యటిస్తున్నారు. తొలుత యూఏఈలో పర్యటించగా.. అనంతరం నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేలో పర్యటించారు. చివరిగా ఇటలీ దేశానికి వెళ్లారు. నేటితో ఐదు దేశాల పర్యటన ముగియనుంది. అనంతరం భారత్‌కు బయల్దేరి రానున్నారు.