SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!

  • మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్
  • తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసిన పాక్ పీఎంవో
  • పాక్ తీరుపై చర్చ
Pmmodi1

Pmmodi1

పాకిస్థాన్ తన వక్రబుద్ధి మార్చుకుంది. తొలుత ఎస్‌సీవో గ్రూప్ ఫొటో నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగించి పాకిస్థాన్ పీఎంవో పోస్ట్ చేసింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో యూ-టర్న్ తీసుకుంది. తాజాగా మోడీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.

షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఎస్‌సీవో దేశాధినేతల గ్రూప్ ఫొటోలో భారత ప్రధాని మోడీ కనిపించలేదు. అయితే మోడీ స్వయంగా సదస్సు నుంచి పోస్ట్ చేసిన ఫొటోలో మాత్రం అన్ని దేశాల నేతలతో పాటు షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. తాజాగా షెహబాజ్ షరీఫ్ తన ఎక్స్ ఖాతాలో అదే గ్రూప్ ఫొటోను మరోసారి పోస్ట్ చేయగా.. అందులో మోడీ కూడా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

మొదట మోడీ లేకుండా ఫొటో..

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో మంగళవారం ఎస్‌సీవో దేశాధినేతల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దేశాధినేతలంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ అధికారిక ఫొటోను పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోలో భారత ప్రధాని మోడీ కనిపించలేదు. మోడీ కూడా సదస్సుకు హాజరైనప్పటికీ.. పాక్ పీఎంవో షేర్ చేసిన ఫొటోలో ఆయనను తొలగించినట్లు కనిపించింది. అయితే మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫొటోలో మాత్రం ఎస్‌సీవో సదస్సుకు హాజరైన నేతలందరూ కనిపించారు. దీంతో పాక్ ప్రధాని కార్యాలయం ఉద్దేశపూర్వకంగానే మోడీ ఫొటోను తొలగించి మార్పు చేసిన చిత్రాన్ని పోస్ట్ చేసిందా? అనే చర్చ మొదలైంది.

ఇంతలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన ఎక్స్ ఖాతాలో గ్రూప్ ఫొటోను పోస్ట్ చేశారు. అయితే ఈసారి ఆయన షేర్ చేసిన చిత్రంలో మోడీ స్పష్టంగా కనిపించారు. దీంతో పాకిస్థాన్ పీఎంవో తొలుత షేర్ చేసిన ఫొటోకు, షెహబాజ్ షరీఫ్ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోకు మధ్య వ్యత్యాసం కనిపించింది. ఒకవైపు పాక్ ప్రధాని కార్యాలయం షేర్ చేసిన ఫొటోలో మోడీ కనిపించకపోగా.. మరోవైపు షెహబాజ్ షరీఫ్ ఖాతాలో మాత్రం పూర్తి గ్రూప్ ఫొటోను పోస్ట్ చేయడం చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారాన్ని కొందరు ‘డిప్లొమాటిక్ యూ-టర్న్’గా అభివర్ణిస్తున్నారు.

ఉగ్రవాదంపై మోడీ ఘాటు వ్యాఖ్యలు

ఇక సదస్సులో భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన విభేదాలు మరోసారి స్పష్టంగా కనిపించాయి. సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోడీ.. ఉగ్రవాదంపై ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా ఉపయోగించే దేశాలు, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు అంతర్జాతీయ సమాజం గట్టి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదుల నియామకం, తీవ్రవాద భావజాలం వైపు మళ్లించడం, వారికి సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందని మోడీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

షెహబాజ్ షరీఫ్ ఏమన్నారు?

మరోవైపు షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్థాన్ చేసిన త్యాగాలను ప్రస్తావించారు. అలాగే సింధు జలాల ఒప్పందం అంశాన్ని కూడా లేవనెత్తారు. “నీరు మన ప్రాంతానికి జీవనాధారం.. దానిని ఆయుధంగా మార్చకూడదు” అని వ్యాఖ్యానించారు.

పుతిన్‌తో షెహబాజ్ ఆసక్తికర భేటీ

ఇదే సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో షెహబాజ్ షరీఫ్‌కు సంబంధించిన మరో దృశ్యం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రూప్ ఫొటో అనంతరం పుతిన్ వేదిక నుంచి వెళ్లిపోతుండగా.. షెహబాజ్ ఆయన దగ్గరకు వేగంగా వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు వీడియోల్లో కనిపించింది. ఈ దృశ్యంపై కూడా సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది.

మొత్తంగా సదస్సులో మోడీ ఫొటో తొలగింపు, ఆ తర్వాత షెహబాజ్ ఖాతాలో అదే ఫొటోలో మోడీ ప్రత్యక్షం కావడం పాకిస్థాన్ సోషల్ మీడియా వ్యవహారంపై ఆసక్తిని పెంచింది. మొదట మోడీ లేని ఫొటోను పోస్ట్ చేసిన పాక్ పీఎంవో.. ఆ తర్వాత షెహబాజ్ మాత్రం మోడీతో ఉన్న పూర్తి ఫొటోను పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.