NTV Telugu Site icon

Rishi Sunak: యూకే పీఏం రేసులో భారత సంతతి వ్యక్తి

Rishi Sunak

Rishi Sunak

యూకే రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని బోరిస్ జాన్సన్ పై విశ్వాసం లేకపోవడంతో 40కి పైగా మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో చేసేందేం లేక ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ సన్నిహితుడు క్రిస్ కు మద్దతుగా నిలిచినందుకు అధికార పార్టీ సభ్యులే ప్రధాని బోరిస్ జాన్సన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ప్రవర్తనతీరపై కూడా ప్రభుత్వంలోని మంత్రులు అసంత్రుప్తితో ఉన్నారు. తాజాగా ఈ రోజు బోరిస్ జాన్సన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా భారత సంతతికి చెందిన రిషి సునక్ తదుపరి పీఎం రేసులో ఉన్నాడనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తొలుత తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తుల్లో రిషి సునక్ ఒకరు. ఆయన బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ గా ఉన్నారు. బ్రిటన్ పీఎం పదవి పొందితే ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రిషి సునక్ నిలుస్తారు.

అయితే 42 ఏళ్ల రిషి సునక్ ను ప్రధాని బోరిస్ జాన్సన్ ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్గా నియమించారు. దీంతో పూర్తిస్థాయి క్యాబినెట్ హోదా పొందారు. గతంలో కరోనా సమయంలో బ్రిటన్ లో చాలా పేరు పొందారు సునక్. కార్మికులు, వ్యాపారుల కోసం 10 బిలియన్ పౌండ్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రిషి సునక్ ‘డిషీ’గా పేరుతెచ్చుకున్నారు. కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన బర్త్ డే వేడుకల్లో పాల్గొని జరిమానాను కూడా ఎదుర్కొన్నారు. రిషి తాతముత్తాతలు పంజాబ్ నుంచి బ్రిటన్ కు వలస వచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి రిషి సునక్ స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు