PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీ్ర్(పీఓకే)లో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అణచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. రోజురోజుకు ఈ ఉద్యమం తీవ్రమవుతోంది. 26 రోజులుగా ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఈ నిరసనల్ని పాక్ క్రూరంగా అణచివేస్తోంది. శాంతియుత నిరసన చేస్తున్నవారిపై కాల్పులు జరుపుతోంది. మరోవైపు, పాకిస్తాన్ నుంచి పీఓకే ప్రాంతానికి వెళ్లే సరకుల్ని, మందులను నిలిపేసింది.
ఈ నేపథ్యంలో, తమకు సాయం చేయాలని పీఓకే ప్రజలు భారత్ను కోరుతున్నారు. భారతదేశంలో, నియంత్రణ రేఖకు(LoC) అవతల నివసిస్తున్న ప్రజల సాయాన్ని అభ్యర్థిస్తూ, ఉద్యమ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రావల్ కోట్ ఈద్గా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తాము తీవ్రమైన ఆహార, ఔషధ కొరతను ఎదుర్కొంటున్నామని, మనమంతా నియంత్రణ రేఖ వైపు వెళ్లాలా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. దీనికి అంతా అటువైపే వెళ్లండి అంటూ సమాధానం ఇచ్చారు.
ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం కాల్పులతో సమాధానం ఇస్తే, వారికి ఇతర మార్గాలు ఉన్నాయని హెచ్చరించారు. నిర్ణీత సమయంలోగా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే జూలై 8న తదుపరి దశ నిరసనల్ని ప్రకటిస్తామని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) హెచ్చరించింది. ఇదిలా ఉంటే పీఓకే అణచివేతకు నిరసనగా వేలాది మంది ప్రవాసీ కాశ్మీరీలు లండన్లో భారీ మార్చ్ నిర్వహించారు. విద్యుత్ ధరలు, గోధుమ పిండి, ఇతర హక్కుల కోసం పీఓకే ప్రజలు గళమెత్తుతున్నారు. ఇదే కాకుండా కాశ్మీరీ శరణార్థులకు పీఓకే శాసనసభలో రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు.

