Pakistan: సౌదీ అరేబియాపై యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదాడులు తీవ్రంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఇప్పుడు కీలకమైన జలసంధి అయిన బాబ్-ఎల్-మండేబ్ (Bab-el-Mandeb)పై ఆధిక్యం సాధించారు. ఇదిలా ఉంటే, ఇంతలా సౌదీ దెబ్బతింటున్నా, పాకిస్తాన్ అండగా నిలువలేదు. ఇటీవల పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీలు కలిసి ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ అనే సైనిక రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు వరకు పాకిస్తాన్ మాత్రం కేవలం మాటలతోనే సౌదీకి అండగా నిలిచింది.
పాకిస్తాన్ తీరుపై సౌదీ ఒకింత ఆగ్రహంతో ఉన్న సమయంలో, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ డ్యామెజ్ కంట్రోల్ పనుల్ని ప్రారంభించారు. ఆదివారం షెహబాజ్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడారు. సౌదీకి పూర్తిగా మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.
పాక్ రెండు నాలుకల ధోరణి:
సౌదీ అరేబియాపై హౌతీల దాడులు పెరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా మారాయి. ‘‘యెమెన్లో జరుగుతున్న పరిణామాలు సౌదీ భూభాగంలోకి వ్యాపిస్తే మక్కా ఒప్పందం అమల్లోకి వస్తుంది” అని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. దీనికి ముందు సౌదీపై దాడి జరిగితే మక్కా ఒప్పందం అమలులోకి రావచ్చని చెప్పారు. మరోసారి ఈ ఒప్పందం రక్షణాత్మకమైంది అని, హౌతీలపై దాడులు చేయడానికి పాకిస్తాన్ సైన్యం ఆటోమేటిక్గా రంగంలోకి దింపే బాధ్యత ఇందులో లేదని మరోసారి పాకిస్తాన్ వ్యాఖ్యానించింది.
ఈ పరిణామాలు సౌదీతో పాకిస్తాన్ సంబంధాలను ప్రశ్నార్థకంగా మార్చాయి. దీంతో ఇప్పుడు నేరుగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రంగంలోకి దిగి సౌదీకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
సౌదీకి పూర్తి మద్దతు: పాకిస్తాన్
ఇంత జరిగినా పాకిస్తాన్, సౌదీకి మాటలతో సంఘీభావం చెప్పే ప్రయత్నం చేసింది. సౌదీ రాజకుటుంబం, ప్రజలకు పాక్ పూర్తిగా మద్దతుగా ఉంటుందని ఆయన అన్నారు. హౌతీల దాడులు ప్రాంతీయ శాంతి, భద్రతకు ముప్పు మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన సరఫరాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ఉప ప్రధాని ఇషాక్ దార్లు కలిసి పనిచేస్తున్నామని పాక్ ప్రధాని కార్యాలయం చెప్పింది.
అమెరికా సాయం కోరుతున్న సౌదీ:
ఇదిలా ఉంటే, పరిస్థితి చేయిజారిపోతున్న తరుణంలో సౌదీ అరేబియా అమెరికా సాయం కోరుతోంది. యెమెన్లో పరిస్థితి తీవ్రం కావడంతో హౌతీలపై దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడిని సౌదీ కోరింది. అయితే, హౌతీలపై నేరుగా దాడి చేసేందుకు ట్రంప్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఓ వైపు హార్ముజ్ సంక్షోభం,ఇప్పుడు బాబ్ ఎల్ మాండెబ్లో భద్రతా ఆందోళనలు ప్రపంచ సముద్ర రవాణా, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ సముద్ర రవాణాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

