Site icon NTV Telugu

Pakistan: అప్పుడు అతిగా ఆనందపడింది.. ఇప్పుడు తాలిబాన్లకు మద్దతు ఉపసంహరించుకుంది..

Pakistan Afghanistan

Pakistan Afghanistan

Pakistan: పాకిస్తాన్‌కి ఆఫ్ఘానిస్తాన్ పక్కలో బల్లెంలా తయారైంది. ముఖ్యంగా తాలిబాన్‌లు నేరుగా పాక్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. 2021 ఆగస్టులో ఆఫ్ఘానిస్తాన్ లోని ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్ పాలన వచ్చేందుకు పాకిస్తాన్ సహకరించింది. ఆ సమయంలో భారత్-ఆఫ్ఘన్ బంధాన్ని దెబ్బతీశామని పాకిస్తాన్ చాలా ఆనందపడింది. ఇక తాలిబాన్ నాయకులు తాము చెప్పినట్లు వింటారని అనుకుంది.

అయితే ఏడాది గడవక ముందే పాకిస్తాన్ కి సీన్ అర్థం అయింది. ముఖ్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) టెర్రర్ గ్రూపు ఆఫ్ఘాన్ తాలిబాన్ల సాయంతో రెచ్చిపోతోంది. పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా, నార్త్ వజీరిస్తాన్ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది. పాక్ ఆర్మీ, పోలీసులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. మరోవైపు భారత్‌తో బంధం తెగిపోయిందని పాక్ భావిస్తున్న తరుణంలో అనధికారికంగా తాలిబాన్లు, భారత్ తో సఖ్యతతోనే మెలుగుతుండటం పాకిస్తాన్ కి మింగుడుపడటం లేదు.

Read Also: E-Air Taxis: 2026 నాటికి భారత్‌‌లో ఈ-ఎయిర్ టాక్సీ సేవలు.. 90 నిమిషాల కార్ జర్నీ 7 నిమిషాల్లోనే..

ఈ నేపథ్యంలో పాక్ తాలిబాన్ల అణిచివేత విషయంలో ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తాము అంతర్జాతీయ స్థాయిలో ఆఫ్ఘన్ తాలిబాన్‌కు మద్దతు పాకిస్తాన్ వెల్లడించింది. తాము ఇకపై కాబూల్‌కి సాయం చేయమని చెప్పింది. ఇకపై తాత్కాలిక ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యేక అధికారాలను విస్తరించమని పాకిస్తాన్ గురువారం వెల్లడించింది.

తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ని పాక్ తాలిబాన్లు వాడుకునేందుకు అనుమతించదని పాకిస్తాన్ ఆశించింది. అయితే ఆఫ్ఘాన్ మాత్రం పెద్దగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆ ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరిన ప్రధాన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి.

అయితే పాక్ వ్యవహారంపై ఆప్ఘాన్ ఘాటుగానే స్పందించింది. తమ నేలను ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడం లేదని.. పాక్ శాంతిని కోరుకున్న విధంగానే ఆఫ్ఘాన్ కూడా శాంతిని కోరుకుంటోందని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు. పాక్ లో శాంతిని కాపాడే బాధ్యత తమకు లేదని స్పష్టం చేశారు. పాక్ తన సొంత దేశ సమస్యలను వారే పరిష్కరించుకోవాలని, వారి వైఫల్యాలకు ఇతరులను నిందించొద్దని ముజాహిద్ అన్నారు.

Exit mobile version