పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను హత్య చేసేందుకు ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ కుట్ర పన్నిందంటూ ఓ బ్రెజిలియన్ జర్నలిస్టు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అంతర్జాతీయంగా పెను దుమారం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ అధికారులు పూర్తిగా ఖండిస్తూ.. అవి నిరాధారమైనవని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇటీవల స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల సందర్భంగా పాకిస్థాన్, ఖతార్ ప్రతినిధి బృందాలు కూడా అక్కడికి వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
బ్రెజిలియన్ జర్నలిస్టు పెపే ఎస్కోబార్.. రాజకీయ విశ్లేషకుడు మారియో నాఫల్ నిర్వహించిన ఒక పోడ్కాస్ట్లో ఈ ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ సైన్యానికి అత్యంత విశ్వసనీయమైన నిఘా సమాచారం అందిందని.. స్విట్జర్లాండ్ పర్యటన సందర్భంగా అసిమ్ మునీర్తో పాటు పాకిస్థాన్ ప్రతినిధి బృందాన్ని లక్ష్యంగా చేసుకుని మొస్సాద్ హత్యాయత్నానికి సిద్ధమైందని పేర్కొన్నారు. “నెతన్యాహు ఆదేశాల మేరకు మొస్సాద్ అసిమ్ మునీర్, పాకిస్థాన్ ప్రతినిధి బృందంపై హత్యాయత్నం చేయాలని ప్రణాళిక రూపొందించిందని పాకిస్థాన్ సైన్యానికి అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది” అని ఎస్కోబార్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ ఇజ్రాయెల్కు తీవ్ర హెచ్చరిక పంపిందని.. అది ఒమన్ ద్వారా చేరి ఉండవచ్చని కూడా పేర్కొన్నారు.
ఎస్కోబార్ ఆరోపణల ప్రకారం.. పాకిస్థాన్ నుంచి ఇజ్రాయెల్కు వెళ్లిన సందేశం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. “మా ప్రతినిధి బృందాన్ని తాకితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అనే హెచ్చరిక పంపినట్లు ఆయన తెలిపారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాకిస్థాన్ ఖండన
అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ అధికారులు పూర్తిగా తిరస్కరించారు. పాకిస్థాన్ ప్రముఖ మీడియా సంస్థ ARY News చైర్మన్ కమ్రాన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఉన్నత స్థాయి భద్రతా అధికారి ఈ వార్తలను “పూర్తిగా అబద్ధం, అసంబద్ధం”గా అభివర్ణించారు.స్విట్జర్లాండ్ పర్యటనలో ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ భద్రతకు ఎలాంటి ముప్పు ఎదురుకాలేదని ఆ అధికారి స్పష్టం చేశారు. “పర్యటన మొత్తం సమయంలో స్విస్ లేదా అమెరికా భద్రతా సంస్థల నుంచి ఎలాంటి హెచ్చరిక రాలేదు. భద్రతా పరంగా ఎటువంటి ఆందోళన కూడా వ్యక్తం కాలేదు” అని పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లో ఉన్నంత కాలం భద్రతా ఏర్పాట్లు సమర్థంగా పనిచేశాయని అధికారులు వెల్లడించారు. అసిమ్ మునీర్ హత్యాయత్నం ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ.. “ఇది వాస్తవాలకు ఏమాత్రం సంబంధం లేని కల్పిత కథ” అని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది స్పష్టత లేకపోయినా.. అమెరికా-ఇరాన్ చర్చలు, పశ్చిమాసియా రాజకీయ పరిణామాలు, ఇజ్రాయెల్-పాకిస్థాన్ సంబంధాల నేపథ్యంలో ఈ అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

