Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వంతో తాము ప్రపంచంలో గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్నామని దాయాది దేశం పాకిస్తాన్ తెగ సంబరపడుతోంది. దేశంలోని అంతర్గత సమస్యల్ని, ప్రజల ఆవేశాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ సమావేశాన్ని పాక్ ఉపయోగించుకుంది. ఇదిలా ఉంటే, మరోవైపు అప్పు కోసం సౌదీ అరేబియా, చైనాల వైపు చూస్తోంది. యూఏఈ ఇచ్చిన అల్టిమేటంతో సతమతమవుతోంది.
3.5 బిలియన్ డాలర్ల తమ అప్పును వెంటనే తిరిగి ఇవ్వాలని యూఏఈ పాకిస్తాన్కు స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్పై ఇప్పుడు మరింత భారం పడింది. పాకిస్తాన్ వద్ద కేవలం 3 నెలల దిగుమతులకు సరిపడే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. అప్పు చెల్లిస్తే పాక్ వద్ద ఫారెక్స్ నిల్వలు ప్రమాదకరంగా పడిపోతాయి. ఈ నేపథ్యంలోనే పాక్ సౌదీ, చైనా సాయాన్ని కోరుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదొర్కోవడానికి షహబాజ్ షరీఫ్ ప్రబుత్వం అప్పులు, పెట్టుబడుల కోసం చర్చలు జరుపుతోందని బ్లూమ్బెర్గ్ నివేదించింది.
ప్రస్తుతం పాక్ వద్ద సుమారు 16 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో యూఏఈకి 3.5 బిలియన్ డాలర్లు ఇవ్వడం ఆ దేశాన్ని మరింత సంక్షోభానికి గురిచేస్తుంది. యూఏఈ 2018 నుంచి పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్లో సుమారు 3 బిలియన్ డాలర్లను డిపాజిట్ చేసింది. ప్రతీ ఏడాది రీన్యువల్ చేసుకుంటూ వస్తోంది. ఏడేళ్లలో మొదటిసారిగా, యూఏఈతో రుణ పునరుద్ధరణ ఒప్పందానికి రావడంలో పాకిస్తాన్ విఫలమైంది. ఈ 3 బిలియన్ డాలర్లకు అదనంగా, పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా యూఏఈకి 450 మిలియన్ డాలర్ల బకాయి రుణాన్ని కూడా చెల్లించాల్సి ఉంది.
అయితే, హఠాత్తుగా ఈ డబ్బు చెల్లించాలని యూఏఈ కోరడం వెనక జియోపాలిటిక్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల కాలంలో సౌదీ అరేబియాతో పాకిస్తాన్ సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకుని దగ్గరైంది. మరోవైపు, యెమెన్ రాజకీయాల్లో యూఏఈ, సౌదీలకు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే యూఏఈ, పాకిస్తాన్ను దూరం పెడుతుందనే వాదన వినిపిస్తోంది.