Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..

  • 9 రోజలు తర్వాత టన్నెల్ నుంచి సురక్షితంగా నేపాలీ కార్మికుడు.
  • 170 మీటర్ల లోతులో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులు..
  • ఆహారం, నీరు లేకుండా ‘‘మహామంత్రాన్ని’’ జపిస్తూ ప్రాణాలతో..
  • స్వీయ అనుభవాలు చెప్పిన కార్మికుడు సంజయ్ షా..
Nepal Floods

Nepal Floods

Nepal Floods: నేపాల్ వరదలు వేయి మందికి పైగా ప్రజల ప్రాణాలను తీశాయి. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అక్కడక్కడ కొందరు అద్భుతంగా బయటపడుతున్నారు. 9 రోజుల తర్వాత టన్నెల్‌లో చిక్కుకున్న ఇద్దరు హైడ్రో పవర్ కార్మికులు సజీవంగా బయటపడ్డారు. 30 ఏళ్ల సంజయ్ షా వరదలు సంభవించిన నాటి నుంచి టన్నెల్‌లో ఆహారం, నీరు లేకుండా సజీవంగా ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

‘‘ప్రమాదంలో చిక్కు్కున్నప్పటి నుంచి తాము మహామంత్రాన్ని జపిస్తూ దేవుడిని ప్రార్థించాము’’ అని చెప్పారు. శుక్రవారం రక్షణ సిబ్బంది బురదతో నిండిన ఒక మార్గం ద్వారా సంజయ్ షానున బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను నేపాల్ ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బయటకు వచ్చిన తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయనను ఆస్పత్రికి తరలించారు. రెండో వ్యక్తిని కూడా రెస్క్యూ సిబ్బంది కాపాడింది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తులు కూడా నేపాల్‌కు చెందినవారే. ఆగస్టు 26న చైనా-నేపాల్ సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో భారీ కొండచరియలు కూలిపోవడంతో ఒక్కసారిగా భోటేకోశి, త్రిశూలి నదులకు వరదలు సంభవించాయి. ఈ వరదల్లో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. 1,280 మంది మరణించగా, 5,500 మందికి పైగా గల్లంతయ్యారు.

ఆ సమయంలో ఎగువ త్రిశూలి-3ఏ హైడ్రో పవర్ ప్రాజెక్టులో మెకానికల్ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్న సంజయ్ షా టన్నెల్‌లో 170 మీటర్ల లోతులో చిక్కుకుపోయాడు. ప్రమాద హెచ్చరికలు వచ్చిన వెంటనే తాము సురక్షితంగా బయటకు రావడానికి ప్రయత్నించామని, తన సహచరుల్ని వదిలి ఒంటరిగా పారిపోవాలని తనకు అనిపించలేదని చెప్పారు. ఒక్కసారిగా నీరు వేగంగా రావడంతో బయటకు వెళ్లే అన్ని మార్గాలు మూసుకుపోయాయని తెలిపారు. టన్నెల్ చాలా పొడవు ఉండటంతో కొద్దిసేపటికే అందరూ లోపల చిక్కుకుపోయారని, ఆ తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంది.? అని తెలుసుకోవడం కష్టంగా మారిందని అన్నారు. 9 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడటంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది తనకు పునర్జన్మ అని చెప్పారు.

టన్నెల్‌లో ఆక్సిజన్ ఉండటంతో..

రెస్క్యూ ఆపరేషన్ చేసిన నిపుణుల ప్రకారం.. సుమారు 4.5 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌లో స్థిరమైన గాలి, ఆక్సిజన్ ఉండటం వల్లే వారు శ్వాసించవచ్చని భావిస్తు్న్నారు. నేపాల్ రక్షక సిబ్బందికి భారత్, చైనా, దక్షిణ కొరియాకు చెందిన నిపుణులు కూడా సహాయం అందిస్తున్నారు. హైడ్రోపవర్ టన్నెల్స్‌లో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్న ఇతర కార్మికుల కోసం గాలింపు కొనసాగుతోంది.