నేపాల్ విలయం ఎంతో మంది ఆత్మీయులను.. రక్తసంబంధికులిని విడదీసింది. అకస్మాత్తుగా వచ్చిన జలప్రళయంతో ప్రాణాలు దక్కించుకునేందుకు తలోదారిలో పరుగులు పెట్టారు. ఇంతలో ప్రళయం ఉవ్వెత్తున దూసుకొచ్చింది. దీంతో కళ్ల ముందే ఎంతో మంది జలసమాధి అయ్యారు. ఇంకొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దక్కించుకున్నారు. దీంతో చెట్టుకొకరు.. పుట్టకొకరు అయిపోయారు. ఆత్మీయులతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. సెల్ఫోన్లు పనిచేయక.. అసలు బ్రతికున్నారా.. లేదా అన్నది తెలియక గుండెలు పగిలిపోయేలా రోధిస్తున్నారు. ఇంకోవైపు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ వారు ఎలా ఉన్నారో తెలియక అధికారులకు ఫోన్లు చేస్తూ భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నేపాల్తో పాటు భారత్ సహా అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
నేపాల్లో సంభవించిన విపత్తు కారణంగా పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్కు చెందిన ఆరుగురు యాత్రికులు సంబంధాలు కోల్పోయారు. వీరిలో కైలాష్ మానసరోవర్ యాత్రలో ఉన్న రెండు జంటలు కూడా ఉన్నారు. జార్ఖండ్లోని రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్లోని ఆరామ్బాగ్, దుర్గాపూర్ వరకు తమ బంధువులతో సంబంధాలు తెగిపోవడంతో అనేక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కొంతమంది పర్యాటకులు తమ క్షేమాన్ని తెలియజేసి కుటుంబాలకు ఉపశమనం కలిగించారు. భారతీయులందరి ఆచూకీ, భద్రతను నిర్ధారించుకోవడానికి నేపాల్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని కుటుంబాలు ప్రభుత్వాలను కోరుతున్నాయి.
నేపాల్లోని అప్పర్ త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న రాంచీ నివాసి రామ్ప్రసాద్ ఘోష్, గత రెండు రోజులుగా తన తండ్రిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయన అందుబాటులో లేడు. విపత్తు సంభవించినప్పటి నుండి రామ్ప్రసాద్ పరిస్థితి లేదా ఆచూకీ గురించి అతని కుటుంబానికి ఎటువంటి కచ్చితమైన సమాచారం అందలేదు. ఆ కుటుంబం అతడిని సంప్రదించడానికి ప్రయత్నిస్తూనే ఉంది.కానీ ఏ విధంగానూ ఎలాంటి సమాచారం పొందలేకపోయారు. కుటుంబానికి వీలైనంత త్వరగా సహాయం అందేలా చూడాలని ఆ కుటుంబం మీడియా ద్వారా జార్ఖండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
బెంగాల్కు చెందిన 65 మంది పర్యాటకులు కూడా చిక్కుకుపోయారు. పర్యాటకుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. పర్యాటకులందరూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ కుటుంబాలు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాయి. సుమారు 60 మంది ఇతర పర్యాటకులతో సహా 65 మంది వ్యక్తుల బృందం ఒక ప్రైవేట్ పర్యాటక బస్సులో ప్రయాణించారు. ఇలా భారతీయులు అనేక మంది జలప్రళయంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం.. నేపాల్ ప్రభుత్వంతో సంప్రదిస్తోంది. సొంత వారి జాడ తెలియక అందరూ బాధిత కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి.

