Pakistan: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితులను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించాడు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని తన సోదరుడైన, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సూచించినట్లు పలు వార్త కథనాలు వస్తున్నాయి. నవాజ్ నివాసంలో వీరి మధ్య జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పినట్లు తెలుస్తుంది.
Read Also: IND vs Ban: పాక్తో పాటు బంగ్లాదేశ్పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
కాగా, పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన ఘటనలో 26 మంది చనిపోయారు. దీంతో భారత్, పాక్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాయాది దేశం కూడ సిమ్లా ఒప్పందంతో పాటు తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, ఈ దాడి తర్వాత పాకిస్తాన్ నేతలు రెచ్చిపోతున్నారు. భారత్పై దాడి చేసేందుకే తమ దగ్గర 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు ఆ దేశ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు. మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షల్లో హిందూ, ముస్లింలు వేర్వేరు అని పేర్కొన్నాడు. పాకిస్తాన్ ఏర్పాటుకు తమ పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు.. వాటిని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కామెంట్స్ చేశాడు. మరోవైపు, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ సైతం నోరు పారేసుకున్నాడు.. సింధూ నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. సింధూ నది తమదే, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనని భారత్పై విమర్శలు చేశాడు. ఈ వివాదం క్రమంగా పెరిగి పోతుండటంతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించాల్సి వచ్చింది.