Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ హత్యకు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కుట్ర చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బ్రెజిలియన్ జర్నలిస్ట్, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ పెపె ఎస్కోబార్ చేసిన ఈ ఆరోపణలు పాకిస్తాన్ నుంచి ఇరాన్ వరకు సంచలనంగా మారాయి. అసిమ్ మునీర్, అతడి టీమ్ను హత్య చేయాలని ఇజ్రాయిల్ కుట్ర పన్నినట్లు ఆరోపించారు. ఇరాన్ శాంతి చర్చల్లో భాగంగా పాక్ ఆర్మీ చీఫ్ స్విట్జర్లాండ్ జెనీవాలో ఉన్న సమయంలో చంపేందుకు ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని ఆయన అన్నారు. యూఎస్-ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పెపె ఎస్కోబార్ రాజకీయ వ్యాఖ్యాత మారియో నౌఫల్తో ఒక పాడ్కాస్ట్ సందర్భంగా ఆయన ఈ వాదన చేశారు.
స్వి్ట్జర్లాండ్ లో జరుగుతున్న చర్చల సమయంలో మునీర్, పాకిస్తానీ ప్రతినిధి బృందాన్ని లేపేయడానికి మొసాద్ కుట్ర పన్నిందనే సమాచారం పాక్ సైనిక గూఢచార విభాగానికి తెలిసిందని ఎస్కోబార్ చెప్పారు. ఈ ఒప్పందంలో ఇజ్రాయిల్ను చేర్చకపోవడం, లెబనాన్పై దాడులు ఆపాలని పదే పదే అమెరికా హెచ్చరిస్తుండటంతో ఇజ్రాయిల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహూ ఆదేశాల మేరకు మొసాద్ ఈ ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పారు.
మొసాద్ కుట్ర గురించి తెలిసిన వెంటనే పాక్ అధికారులు, దౌత్య మధ్యవర్తులు స్పందించినట్లు ఎస్కోబార్ చెప్పారు. ఒమన్ ద్వారా నేరుగా ఇజ్రాయిల్కు ఈ సమాచారం వెళ్లిందని భావిస్తున్నానని, మా ప్రతినిధి బృందాన్ని టచ్ చేస్తే మొత్తం భూమి పై నుంచి మిమ్మల్ని తుడిచివేస్తామని పాక్ హెచ్చరించిందని వెల్లడించారు. అయితే, ఎస్కోబార్ చేస్తున్న ఈ వాదనల్ని ఏ దేశం కూడా ధ్రువీకరించలేదు. ఎస్కోబార్ వాదనల్ని పాకిస్తాన్ పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. ఇవి నిరాధారమైనవిగా అభివర్ణించారు.

