భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరో కీలక దశలోకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు ముందే ఆయన భారత్లో పర్యటించేలా ఇరు దేశాలు తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్ తొలి వారంలో రహమాన్ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 12-13 తేదీల్లో 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. 2024లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
తారిఖ్ రహమాన్ను త్వరలోనే న్యూఢిల్లీకి ఆహ్వానించి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించేందుకు భారత్, బంగ్లాదేశ్ చర్చలు జరుపుతున్నాయి. ఈ పర్యటన ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే ప్రధాని నరేంద్ర మోడీ.. రహమాన్ను భారత్ పర్యటనకు ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత రహమాన్ మలేసియా, చైనా పర్యటనలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రహమాన్ ఢిల్లీ పర్యటనను ఖరారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రహమాన్ భారత్ పర్యటన ఖరారైతే.. ఇరు దేశాల మధ్య చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గంగానది జలాల ఒప్పందం పునరుద్ధరణ, బంగ్లాదేశ్పై విధించిన వాణిజ్య ఆంక్షల సడలింపు, ఆర్థిక సహకారం, భద్రత, ప్రాంతీయ పరిణామాలు వంటి అంశాలు చర్చల ఎజెండాలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2025 మేలో బంగ్లాదేశ్పై విధించిన కొన్ని వాణిజ్య ఆంక్షలను వెనక్కి తీసుకునే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపై పురోగతి సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు భారత్ దగ్గర ఉన్నాయి. సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులోని ఔట్రీచ్ సమావేశానికి బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్ను భారత్ ఆహ్వానించినట్లు సమాచారం. అదే సమయంలో రహమాన్ బిమ్స్టెక్ (BIMSTEC) అధ్యక్షుడిగా కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన ద్వైపాక్షిక చర్చలతో పాటు బహుపాక్షిక సమావేశాలకు కూడా వేదికగా మారనుంది.
షేక్ హసీనా అంశం కీలకం
భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా అంశం ఇప్పటికీ కీలకంగా ఉంది. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోయిన హసీనా ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్నారు. ఇటీవల ఆమె న్యూఢిల్లీ నుంచి ఆడియో ఆధారిత వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తారిఖ్ రహమాన్ ప్రభుత్వాన్ని ఆమె ‘‘చట్టవిరుద్ధమైనది’’గా అభివర్ణిస్తూ.. ‘‘నాటకంలా నిర్వహించిన ఎన్నిక’’ ద్వారా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
అయితే ఈ కార్యక్రమంతో భారత్కు ఎలాంటి సంబంధం లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రైవేట్ మీడియా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని.. హసీనా చేసిన వ్యాఖ్యలకు న్యూఢిల్లీ మద్దతు ఇవ్వడం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మరోవైపు షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఢాకా భారత్ను కోరుతోంది. హసీనాను విచారణ ఎదుర్కొనేందుకు తిరిగి బంగ్లాదేశ్కు పంపాలని తారిఖ్ రహమాన్ కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై భారత ప్రభుత్వం.. అప్పగింత అభ్యర్థనను ‘‘స్థిరపడిన న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా పరిశీలిస్తున్నాం’’ అని తెలిపింది.
మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య రక్షణ సంబంధాలు కూడా విస్తరిస్తున్నాయి. ఢాకా, ఇస్లామాబాద్ మధ్య ఉన్నతస్థాయి సైనిక సంబంధాలు, పరస్పర పర్యటనలు పెరిగాయి. రక్షణ రంగంలో సహకారంపై కూడా ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాకిస్థాన్కు చెందిన JF-17 థండర్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే అంశంపై బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ అనుసరిస్తున్న మారుతున్న ప్రాంతీయ దౌత్య విధానంలో ఈ పరిణామాలు మరో కోణాన్ని తెరపైకి తెచ్చాయి.
ఇక భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య, భద్రతా మార్గాల్లో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఆగస్టులో బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది.. తారిఖ్ రహమాన్ను ఢాకాలో కలిశారు. ప్రధాని మోడీ శుభాకాంక్షలను ఆయన రహమాన్కు తెలియజేసినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
మరోవైపు భారత గూఢచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) చీఫ్ పరాగ్ జైన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం బంగ్లాదేశ్ పర్యటించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరిగినట్లు సమాచారం. భద్రతా వ్యవహారాల సలహాదారు బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ ఏకేఎం షంసుల్ ఇస్లాం, హోంమంత్రితో భారత ప్రతినిధి బృందం సమావేశమైనట్లు తెలుస్తోంది. ప్రాంతీయ భద్రత, ఇరు దేశాల మధ్య సంస్థాగత నమ్మకాన్ని పునరుద్ధరించే అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
ఏం చర్చిస్తారు?
తారిఖ్ రహమాన్ ఢిల్లీ పర్యటన ఖరారైతే.. గంగానది జలాల ఒప్పందం, వాణిజ్య పరిమితులు, ఆర్థిక సహకారం, భద్రత, ప్రాంతీయ పరిణామాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. అదే సమయంలో బ్రిక్స్ ఔట్రీచ్ సమావేశం ద్వారా భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు విస్తృత బహుపాక్షిక వేదికపైనా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు దేశాలు రహమాన్ పర్యటన తేదీలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో తారిఖ్ రహమాన్ న్యూఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

