Modi-Meloni Selfie Goes Viral: ఇటలీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రోమ్ చేరుకోగా, ఇటలీ ప్రధాని జార్జియా మెలో ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో మోడీతో కలిసి దిగిన ఓ కొత్త సెల్ఫీని పంచుకుంటూ “రోమ్కు స్వాగతం, నా మిత్రమా!” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని మోడీ చేపట్టిన ఐదు దేశాల ఐరోపా పర్యటనలో ఇటలీ చివరి మరియు అత్యంత కీలకమైన దశగా భావిస్తున్నారు. జార్జియా మెలోని ప్రత్యేక ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన, మోడీ ఇటలీలో చేపట్టిన తొలి అధికారిక ద్వైపాక్షిక పర్యటన కావడం విశేషం. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, క్లీన్ ఎనర్జీ, ప్రపంచ సహకారం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.
మోడీ-మెలోని ఫొటోలు లేదా వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో దుబాయ్లో జరిగిన COP28 సదస్సులో “గుడ్ ఫ్రెండ్స్ ఎట్ COP28” సెల్ఫీ, 2024లో ఇటలీలో జరిగిన G7 సమావేశంలో “హలో ఫ్రం టీమ్ మెలోని” వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు తాజా సెల్ఫీ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటలీ చేరుకున్న ప్రధాని మోడీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వారణాసి ఘాట్లను ప్రతిబింబించే ఒక ప్రత్యేక చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. మోడీ కూడా అక్కడి భారతీయులతో ఆప్యాయంగా మమేకమయ్యారు.
ఈ పర్యటనలో ప్రధాని మోడీ.. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాతో సమావేశం కానున్నారు. అలాగే జార్జియా మెలోనితో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు, ఇరు దేశాల ప్రముఖ సీఈవోలతో సమావేశమై పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపై చర్చించనున్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, 2023 తర్వాత మోడీ-మెలోని మధ్య ఇది ఎనిమిదో సమావేశం. భారత్-ఇటలీ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 2025-29 సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక కింద రక్షణ, ఉగ్రవాద నిరోధం, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో ఇటలీ భారతదేశానికి నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2025 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 14.25 బిలియన్ యూరోలకు చేరుకుంటుందని అంచనా. 2029 నాటికి దీన్ని 20 బిలియన్ యూరోలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ రంగంలో కూడా ఇరు దేశాలు కలిసి సైనిక పరికరాల సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అలాగే క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో సంయుక్త ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతోంది. ఇక, ఇటలీలో ప్రస్తుతం 2 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. వలస మరియు చలనశీలత ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ప్రజల రాకపోకలు మరింత సులభతరం అయ్యాయి. మొత్తంగా, ప్రధాని మోడీ ఇటలీ పర్యటన భారత్-ఇటలీ సంబంధాలకు కొత్త ఊపునిస్తూ, వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో మరింత సహకారానికి దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026
