ప్రధాని విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29 నుంచి నవంబరు 2 వరకు ఇటలీ, బ్రిటన్లలో పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు.. ఇటలీలోని రోమ్లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
ఇటలీ పర్యటన తర్వాత మోడీ.. గ్లాస్గౌలో జరిగే కాప్-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్కు వెళ్లనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్.. మోదీని ఆహ్వానించారు. అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకు కాప్-26 సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ‘ప్రపంచ నేతల సదస్సు’ నవంబరు 1-2 మధ్య జరగనుంది. ఇందులో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ఇటలీ, బ్రిటన్ అధ్యక్షత వహించనున్నాయి. 120పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
ఇదిలా వుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న ఎనిమిదో జీ-20 సదస్సు ఇది. అంతేకాదు.. భారత్ తొలిసారిగా 2023లో జీ-20 సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ సహా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక భేటీల్లో మోదీ పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటనలో విడుదల చేసింది.
