JD Vance: స్విట్జర్లాండ్‌లో జేడీ వాన్స్‌కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్

  • స్విట్జర్లాండ్‌లో ఇరాన్ షాక్
  • జేడీ వాన్స్‌కు అవమానం
  • వీడియోలు వైరల్
Jdvance1

Jdvance1

స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఇరాన్-అమెరికా శాంతి చర్చల సందర్భంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఘోర అవమానం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ బృందం కనీసం పట్టించుకోలేదని తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో కరచాలనం చేశారు గానీ.. జేడీ వాన్స్‌ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఒక చోట అలానే నిలిచి ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే…

అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరిగిన శాంతి చర్చల సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఘటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చర్చల ప్రారంభ సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ అకస్మాత్తుగా తన ప్రతినిధి బృందంతో సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోవడం దౌత్య వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో అమెరికా చర్చల బృందం.. ముఖ్యంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

×
×
Ad

సమావేశం ప్రారంభానికి ముందు అబ్బాస్ అరాఖ్చీ.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు, అలాగే సంయుక్త ఫొటో అవకాశంపై తలెత్తిన విభేదాలే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. దీంతో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ ప్రతినిధులు ఆశ్చర్యానికి గురికాగా.. జేడీ వాన్స్ కూడా పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లు వీడియోల్లో కనిపించింది. అయితే కొద్దిసేపటి తర్వాత చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దీంతో చర్చల్లో ఇరాన్ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తుండగా.. అమెరికా మాత్రం ప్రతిస్పందించే స్థితిలో ఉందనే అభిప్రాయం బలపడింది.

దౌత్య విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఘటన కేవలం సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం మాత్రమే కాదు.. చర్చల సమయంలో ఇరాన్ తన ప్రభావాన్ని ప్రదర్శించిన చర్యగా కనిపిస్తోంది. సమావేశ మందిరంలో అమెరికా ప్రతినిధులు ముందుగానే చేరుకుని వేచి ఉండగా.. ఇరాన్ బృందం తర్వాత ప్రవేశించింది. అరాఖ్చీ చివరగా వచ్చి అమెరికా ప్రతినిధులతో కరచాలనం చేయకపోవడం కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ అధికారులు సంయుక్త ఫొటో అవకాశాన్ని అమెరికా మీడియా ప్రచారంగా అభివర్ణిస్తూ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో స్విట్జర్లాండ్ ఘటన ఇరాన్ చర్చల్లో బలమైన స్థితిలో ఉందనే సంకేతంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్‌కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయనే వాదనకు మరో కారణంగా ట్రంప్ తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నారు. గతంలో ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా పట్టుబడగా.. ఇటీవల పారిస్‌లో ట్రంప్ మాట్లాడుతూ ఇతర దేశాలకు ఉన్నట్లే ఇరాన్‌కూ కొన్ని బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉండే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ఇది అమెరికా గత వైఖరితో పోలిస్తే గణనీయమైన మార్పుగా భావిస్తున్నారు. ఇరాన్‌కు ఇది ఒక దౌత్య విజయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఒప్పందంతో ఇరాన్‌కు లాభాలేనా?

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో ఇరాన్‌కు అనుకూలమైన అనేక అంశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఆంక్షల సడలింపు, ఇరాన్ చమురు ఎగుమతులకు మినహాయింపులు, నిలిచిపోయిన ఆస్తుల విడుదల, ఆర్థిక పరిమితుల సడలింపు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఇరాన్ తన మొత్తం క్షిపణి కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని, అణు కార్యక్రమానికి సంబంధించిన ప్రధాన అంశాలను భవిష్యత్ చర్చలకు వదిలివేసినట్లు సమాచారం. ఇరాన్ చమురు రంగానికి సంబంధించిన పెట్టుబడులు, పునర్నిర్మాణ కార్యక్రమాలపై కూడా చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

విమర్శల మధ్య అమెరికా

ఈ పరిణామాలపై అమెరికాలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభంలో ఇరాన్‌పై కఠిన వైఖరి అవలంబించిన వాషింగ్టన్ చివరకు తన లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇరాన్ మాత్రం తన కీలక వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఆర్థిక ప్రయోజనాలు సాధించిందని అంటున్నారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ చిన్న ఘటన చర్చల ఫలితాలను మార్చకపోయినా.. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇరాన్-అమెరికా శక్తి సమీకరణాలపై కొత్త చర్చకు దారితీసింది. దౌత్య రంగంలో ప్రతీకాత్మక సంఘటనలు కూడా ఎంత ప్రభావం చూపగలవో ఈ ఘటన మరోసారి చూపించింది.