అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్పై దాడులు చేయాలన్న అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ చాలా హాట్ హాట్గా సాగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్పై యుద్ధం విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్లుగా ఆక్సియోస్ తన నివేదికలో పేర్కొంది.
సోమవారం నెతన్యాహు-జేడీ వాన్స్ల మధ్య జరిగిన తీవ్ర సంభాషణ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని కొందరు జేడీ వాన్స్ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైట్ హౌస్ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇజ్రాయెల్-అమెరికన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం గురించి నెతన్యాహు చేసిన అనేక అంచనాలు.. ముఖ్యంగా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు తిరుగుబాటు చేసే విషయంలో మితిమీరిన ఆశావాదంతో కూడుకున్నవని పేర్కొన్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి ముందు పాలన మార్పు జరిగే అవకాశం వాస్తవం కంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పి నెతన్యాహు.. అధ్యక్షుడు ట్రంప్ను ప్రలోభపెట్టారని.. ఇప్పుడు ఆ వ్యాఖ్యల గురించి నెతన్యాహును జేడీ వాన్స్ ప్రశ్నిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా ఇరాన్ గడ్డపై అమెరికా దళాలు భూతల దాడులకు దిగడంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంతంలోని తమ స్థావరాల్లో సొంత సైనికులను కాపాడలేక.. వారిని హోటళ్లు, పార్కుల్లో దాచిపెడుతున్న అమెరికా.. ఇరాన్ గడ్డపై వారిని ఎలా కాపాడగలదు?.’’ అని ప్రశ్నించారు.
రష్యా హెచ్చరిక
ఇరాన్లో అమెరికా జరిపే భూతల సైనిక చర్య వియత్నాం యుద్ధం వంటి పరిణామాలనే కలిగిస్తుందని.. దాని నుంచి అమెరికా గౌరవప్రదంగా బయటపడలేదని రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు మెద్వెదేవ్ హెచ్చరించారు. అటువంటి పరిణామాలు ఈ ప్రాంతానికి వినాశకరంగా ఉంటాయని తెలిపారు. గతంలో ఇరాన్ కూడా అమెరికాకు వియత్నాం యుద్ధాన్ని గుర్తు చేసిందని.. వియత్నాం యుద్ధంలో అమెరికా ఘోర పరాజయాన్ని చవిచూసిందని.. అమెరికా ప్రజలు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరని గమనించాలని రష్యా సూచించింది.
