ఇటీవల హార్ముజ్ జలసంధిలో భారత్ నౌకలపై అమెరికా దాడులు చేసింది. దీంతో నౌకలు ధ్వంసంతో పాటు పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా దౌత్యవేత్తను పిలిచి భారత్ నిరసన వ్యక్తం చేసింది. అయితే ఇదే వ్యవహారంపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. భారత్ నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని రాసుకొచ్చారు. ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక సందేశం ఇచ్చారు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు అమెరికా జారీ చేసే భద్రతా ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు స్పష్టం చేసినట్లు సమాచారం.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న భద్రతా ఆందోళనల నేపథ్యంలో రూబియో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను నిర్ధారించేందుకు అమెరికా చేపడుతున్న చర్యలకు అన్ని వాణిజ్య నౌకలు సహకరించాలని సూచించారు.
ఇటీవల హార్ముజ్ జలసంధి సమీపంలో పలు వాణిజ్య నౌకలపై దాడులు, డ్రోన్ ముప్పులు వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ సమాజం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారత నౌకలు, భారతీయ సిబ్బంది భద్రతపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. భారత్-అమెరికా మధ్య జరిగిన ఈ చర్చల్లో ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణ, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుండటంతో అక్కడి పరిస్థితులపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

