Site icon NTV Telugu

Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు

Israel

Israel

మధ్యప్రాచ్యం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దీంతో పలు భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అలాగే దక్షిణ లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా బీరుట్‌లో ఇజ్రాయెల్ దళాలు భారీ దాడి చేశాయి. పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Iran-Mandeb: ఇరాన్ మరో జలసంధిని మూసేబోతుందా? మండేబ్‌పై సర్వత్రా టెన్షన్

శనివారం తెల్లవారుజామున అరగంట వ్యవధిలో రెండు పెద్ద పేలుళ్లు వినిపించాయని, పేలుడు జరిగిన ప్రదేశాల్లో ఒకదాని నుంచి పొగ పైకి లేవడం కనిపించిందని ఒక ఏఎఫ్‌పీ విలేకరి నివేదించారు. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా గ్రూపు నుంచి వచ్చే బలగాలను అడ్డుకోవడానికి తూర్పు లెబనాన్‌లో ఒక వంతెనను ధ్వంసం చేసిన ఒక రోజు తర్వాత… బీరుత్‌లోని హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది.

ఇది కూడా చదవండి: Iran-US War: ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు.. ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు కీలక నేతలంతా హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ ఇంధన క్షేత్రాలపై దాడులు చేశాయి. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇక ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా ఉగ్రవాద గ్రూపులు దాడులు చేశాయి. దీంతో అప్పటి నుంచి ప్రతీకారంగా హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గాజాలో హమాస్‌ను అంతం చేసినట్లుగానే హిజ్బుల్లాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ పూనుకున్నట్లుగా తెలుస్తోంది.

Exit mobile version