ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు శాంతి ఒప్పందం కుదరలేదు. దీనికి ప్రధాన కారణం ఇరాన్ దగ్గర ఉన్న యురేనీయమే. ఈ ఒక్కదాని దగ్గరే శాంతి ఒప్పందం ఆగిపోయింది. ఎన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేసినా.. ఒక్కదాని దగ్గర పంచాయితీ తెగడం లేదు.
తాజాగా ఇరాన్ యురేనీయంపై షాకింగ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇరాన్ దగ్గర ప్రస్తుతం 10 అణు బాంబ్లకు సరిపడా యురేనీయం నిల్వలు ఉన్నట్లుగా తేలింది. ఇరాన్ దగ్గర సుమారు 970 పౌండ్లకు సమానమైన 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఇది సాంకేతికంగా ఆయుధ స్థాయి (90 శాతం) కంటే తక్కువ అయినప్పటికీ.. అణుబాంబు తయారీకి అత్యంత దగ్గరగా ఉన్న స్థాయి అని నిపుణులు చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ తన “న్యూక్లియర్ పదార్థాన్ని” పూర్తిగా అప్పగించాలనే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం శాంతియుత అణు కార్యక్రమం నిర్వహించేందుకు తమకు హక్కు ఉందని వాదిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇరాన్ దగ్గర ఉన్న ప్రస్తుత యురేనియం నిల్వలను మరింత శుద్ధి చేస్తే కొన్ని రోజులు లేదా వారాల్లోనే ఆయుధ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ నిల్వలు సుమారు 10 అణుబాంబులు తయారు చేయడానికి సరిపోతాయని అంచనా వేసింది. ఇరాన్ ఈ యురేనియాన్ని నాటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ వంటి ప్రధాన కేంద్రాల్లో సెంట్రిఫ్యూజ్ల ద్వారా శుద్ధి చేసినట్లు సమాచారం. అయితే 2025 జూలైలో జరిగిన అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత అంతర్జాతీయ పరిశీలన నిలిచిపోవడంతో పరిస్థితి మరింత అనిశ్చితంగా మారింది.
ఇక అమెరికా దాడుల తర్వాత ఇస్ఫహాన్ కేంద్రం కింద ఈ యురేనియం పాతిపడిపోయి ఉండవచ్చని ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. అయితే అది పూర్తిగా ధ్వంసమైందని చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. ట్రంప్.. చర్చలు విఫలమైతే ఈ యురేనియాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కూడా సూచించినట్లు సమాచారం. అయితే నిపుణులు దీన్ని అత్యంత క్లిష్టమైన సైనిక చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికీ ఆ యురేనియం ఎక్కడ ఉందో స్పష్టత లేకపోవడం పెద్ద సవాలుగా మారింది. అలాగే దాన్ని సురక్షితంగా తరలించడం, పరిశీలించడం కూడా అత్యంత కష్టసాధ్యమైన పని అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాల తయారీకి ప్రయత్నించడం లేదని చెబుతోంది. కానీ ఉన్న అధిక శుద్ధి యురేనియం నిల్వలే అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్య పరిష్కారానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరాన్ నుంచి యురేనియాన్ని పూర్తిగా తరలించడం, మరొకటి దేశంలోనే దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి తగ్గించడం. అమెరికా, రష్యా వంటి దేశాలు ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి, ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వల భవిష్యత్తే అమెరికా–ఇరాన్ అణు చర్చల విజయాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారింది.
అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న తాజా చర్చల్లో ఇరాన్ దగ్గర ఉన్న అధిక స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ప్రధాన వివాదాస్పద అంశంగా మారాయి. ఈ నిల్వల భవిష్యత్తుపైనే రెండు దేశాల ఒప్పందం విజయమా లేక విఫలమా అన్నది ఆధారపడి ఉందని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
