పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలు కాబోతుందా? మధ్యప్రాచ్యం బాంబు దాడులతో దద్దరిల్లనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్తో మళ్లీ ఘర్షణ మొదలయ్యే అవకాశముందని ఇరాన్ హెచ్చరించింది. దేశ సాయుధ దళాలు కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇరాన్కు చెందిన సర్దార్ మహమ్మద్ జాఫర్ అసది (ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ ఉప పరిశీలకుడు) మాట్లాడుతూ.. ఒప్పందాలను అమెరికా పాటించడం లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఫార్స్ వార్తా సంస్థ (Fars News Agency) ప్రచురించింది. ‘‘అమెరికా అధికారుల ప్రకటనలు, చర్యలు చూస్తే ఒప్పందాల పట్ల కట్టుబాటు కనిపించడం లేదు. ఇవన్నీ ప్రధానంగా మీడియా కోసం చేస్తున్న ప్రకటనలే. చమురు ధరలు పడిపోకుండా చూడడం, తాము సృష్టించిన సమస్యల నుంచి బయటపడటమే వారి లక్ష్యం.’’ అని విమర్శించారు. ఇరాన్ సైన్యం అవసరమైతే మరింత తీవ్ర చర్యలకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
మరోవైపు సీఎన్ఎన్ నిర్వహించిన విచారణలో గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు భారీ నష్టం జరిగినట్లు వెల్లడైంది. కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్ దగ్గర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని… స్థావరంలోని కొన్ని భాగాలు పనికిరాకుండా పోయాయని నివేదిక పేర్కొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు.. గల్ఫ్, పరిసర ప్రాంతాల్లోని కనీసం 8 దేశాల్లో ఉన్న 16 అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక వ్యవస్థపై దీని ప్రభావం గణనీయంగా ఉందని నివేదికలో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఆర్థికంగా కూడా ఇరాన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. అమెరికా చర్యల కారణంగా హార్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో చమురు రవాణాకు అంతరాయం కలిగి… ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయిందని అంచనా వేసింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ పరిసరాల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగా.. సరుకు రవాణాపై ప్రభావం పడుతోంది.
