Iran-US: హమ్మయ్య.. అమెరికాతో ఒప్పందానికి లైన్‌క్లియర్!.. ఇరాన్ కీలక ప్రకటన

  • పశ్చిమాసియాలో శాంతి జ్వాలలు
  • చర్చలు దిశగా అమెరికా-ఇరాన్ అడుగులు
  • ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాలు
Usiran

Usiran

హమ్మయ్య.. మొత్తానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటి రోజున అమెరికా-ఇరాన్ పరస్పరం తీవ్ర హెచ్చరికలు జారీ చేసుకున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన వచ్చని అంతా భయపడ్డారు. కాని కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ స్వరం మారింది. ఇరాన్ యురేనీయం వదులుకొనేందుకు సిద్ధంగా ఉందని.. వారాంతంలో శాంతి ఒప్పందం జరగొచ్చని ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు కొత్త ముప్పు వస్తే ఏం జరగుతుందోనని భయాందోళన చెందాయి. మొత్తానికి పశ్చిమాసియా శాంతించింది. మార్కెట్లు కూడా భారీగా పుంజుకున్నాయి.

తాజాగా శాంతి ఒప్పందంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత అవగాహన ఒప్పందం (MoU)లో ఎక్కువ భాగం ఇప్పటికే ఖరారైనట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని.. దేశ అత్యున్నత నాయకత్వం పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది. ఈ వారాంతంలో యూరప్‌లోనే సంతకాలు కూడా జరగవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

×
×
Ad

ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రతిపాదిత ఒప్పందంలోని చాలా భాగం ఇప్పటికే ఇరు దేశాల మధ్య సమన్వయమైందని వెల్లడించారు. అయితే ఇరాన్ తన రెడ్ లైన్స్ విషయంలో ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. తొలుత చర్చించిన అంశాలపై అంగీకారం వచ్చినప్పటికీ.. అనంతరం అమెరికా కొత్త డిమాండ్లు తీసుకురావడం.. తన వైఖరిని మార్చుకోవడం వల్ల సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఒప్పందంలోని ఎక్కువ భాగం ఖరారైందని.. కానీ అమెరికా కొత్త డిమాండ్లు పెట్టడంతో పరిస్థితి క్లిష్టమైందని బఘాయీ వ్యాఖ్యానించారు.

ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. ప్రతిపాదిత అవగాహన ఒప్పందంలో పలు కీలక అంశాలు ఉన్నాయి.

అన్ని రంగాల్లో తక్షణం, శాశ్వత కాల్పుల విరమణ
లెబనాన్‌లో కూడా ఘర్షణల నిలిపివేత
ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోబోదన్న హామీ
30 రోజుల్లో అమెరికా ఆధ్వర్యంలోని సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం
హార్ముజ్ జలసంధిని మళ్లీ తెరవడం
ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపై ఆంక్షల సడలింపు
ఇరాన్‌కు చెందిన ఆర్థిక ఆస్తులపై మళ్లీ ప్రాప్యత కల్పించడం
స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధుల విడుదల
తుది అణు ఒప్పందం కోసం 60 రోజుల ప్రత్యేక చర్చల వ్యవధి
అంతేకాకుండా ఇరాన్ క్షిపణి కార్యక్రమం, ప్రాంతీయ మిత్ర బలగాలకు మద్దతు వంటి అంశాలు చర్చల పరిధిలో ఉండబోవని కూడా నివేదిక పేర్కొంది.

యుద్ధం నుంచి చర్చల దిశగా

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన ఘర్షణలు మధ్యప్రాచ్యాన్ని తీవ్ర అస్థిరతలోకి నెట్టాయి. ఏప్రిల్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి, ఆర్థిక ఆంక్షల అంశాలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటిదాకా ఇరాన్‌పై మరిన్ని దాడులు జరగొచ్చని ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఒక దశలో ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రాలపై అమెరికా నియంత్రణ సాధించవచ్చని కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ కూడా ఒత్తిడికి తలొగ్గబోదని, కొత్త దాడులు జరిగితే మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.

అమెరికా వైపు నుంచి ఆశావహ సంకేతాలు వస్తున్నప్పటికీ.. ఇరాన్ మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. దేశ అత్యున్నత నాయకత్వం ఆమోదం లభించిన తర్వాతే అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అయితే ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఇరు దేశాలు ఒప్పందానికి ఇంత దగ్గరగా రావడం ఇదే తొలిసారి కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక మిగిలిన రాజకీయ, భద్రతా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరితే అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందానికి మార్గం సుగమం కానుంది.