ఇరాన్-అమెరికా మధ్య ఏర్పడిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తోంది. మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరలేదు. వాస్తవంగా మంగళవారం ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలు జరగాల్సి ఉండగా నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికాతో చర్చలు ఉండబోవని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా బెదిరిస్తోందని.. ఇలాంటి ధోరణి ఉన్నప్పుడు చర్చలు ఎలా జరుపుతామని ఇరాన్ పేర్కొంది. మరోవైపు హార్ముజ్ను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ నౌకలపై దాడులు చేయడంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించింది.
అయితే గడువులోగా ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. బ్రిడ్జ్లు, విద్యుత్ ప్లాంట్లపై భీకర దాడులు ఉంటాయని ట్రంప్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్లో ఇజ్రాయెల్ ఆపరేషన్ ఇంకా ముగియలేదని.. మా పని కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలను చూస్తుంటే మరోసారి మధ్యప్రాచ్యంలో భీకర దాడులతో అట్టుడికే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేసేందుకు ఇరాన్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాన్ని చూశాయి. మరోసారి ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తే.. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ఉధృతం చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్, చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. మరోసారి పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే.. ప్రపంచ దేశాలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. ట్రంప్ బెదిరింపులతో కాల్పుల విరమణ ఉల్లంఘనలతో దౌత్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ బెదిరింపులకు టెహ్రాన్ లొంగదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగితే యుద్ధ భూమిలో కొత్త ఎత్తుగడలు వేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండానే అర్ధాంతరంగా చర్చలు ముగిశాయి. దీంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. రెండో విడత చర్చల కోసం కూడా పాకిస్థాన్ ప్రయత్నించింది. సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించి ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. కానీ అమెరికాతో చర్చలకు ఇరాన్ సుముఖంగా లేనట్లుగా సమాచారం. చర్చలపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో 24 గంటల తర్వాత మధ్యప్రాచ్యంలో ఏం జరగబోతుందో వేచి చూడాలి.
